హైదరాబాద్: ఓ వ్యక్తి నడిచేందుకు తన కాలు సహకరించకపోవడంతో వైద్యం చేయించుకునేందుకు వేరే ఊరికి వెళ్లాడు. చికిత్స అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వస్తున్నాడు. మరో పది నిమిషాలైతే ఇంటికి వెళతారనగా.. మృత్యువు కారు ప్రమాద రూపంలో వెంటాడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం నాగులపాడుకు చెందిన జాలా చిరంజీవి(42) తన కాలుకు చికిత్స చేయించుకునేందుకు భార్య స్వాతి, కుమారుడు పవన్ సాయంతో విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం మధ్యాహ్నా సమయంలో కారులో ఇంటికి వస్తున్నారు. అద్దంకి మండలంలోని వెంకటాపురం వద్ద జాతీయ రహదారిని దాటే క్రమంలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. మరి 10 నిమిషాలైతే.. ఇంటికి చేరుకుంటారనే లోపే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే చనిపోగా, భార్య, కుమారుడు, డ్రైవర్ రాజేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి కారును ఢీకొట్టిన కారులో ఉన్న విజయవాడకు చెందిన మామిడిబత్తుల వెంకటశశిధర్, బి.హరీష్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని మొదట 108 వాహనంలో అద్దంకి ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తీసుకెళ్లారు. మృతుడు చిరంజీవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm