నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ పట్టణం మరోసారి ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఇంకా మరువక ముందే.. స్థానికంగా మరో ఘటన అలజడి సృష్టించింది. ఓ వ్యక్తి తన భార్యతో చనువుగా ఉంటున్నాడనే ఉద్దేశంతో పోలీసు స్టేషన్ ఎదుటే మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో చనువుగా మాట్లాడుతున్నాడంటూ పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్లో మరో వ్యక్తిపై మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయమై.. ఇరు వర్గాల వారిని పోలీసులు పిలిపించారు. పోలీసు స్టేషన్కి వచ్చే క్రమంలో తన భార్యతో చనువుగా ఉంటోన్న వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పోలీసు స్టేషన్లోకి పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అనంతరం తేరుకున్న పోలీసులు గాయాల పాలైన వ్యక్తిని వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm