హైదరాబాద్: సంక్షోభం కొత్త కొత్త అవకాశాలను కల్పిస్తుంది. కొత్త ఆలోచనలకు నాంది పలుకుతుంది. కొత్త దారులకు బీజం వేస్తుంది. ఇది కూడా అలాంటిదే. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రపంచంలోని కార్ల మార్కెట్ మొత్తం కుదేలైంది. 2019 సంవత్సరంలోనే పెద్దగా విక్రయాలు లేని కార్ల కంపెనీలు ఇప్పుడు కరోనా వల్ల మరింత నష్టపోతున్నాయి. కరోనా ప్రభావం మరో రెండేళ్ల వరకు ఉంటుందనే భయాలు కూడా ఉన్నాయి. దాని వల్ల ఎవరి ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. దీంతో కార్ల కంపెనీలు కొత్త ఐడియాతో ముందుకొస్తున్నాయి. గత వారం మారుతీ సుజుకీ కంపెనీ మూడు ఫైనాన్షియల్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. చోళమండలం ఫైనాన్స్, ఐసీఐసీఐ, సుజుకి లాంటి కంపెనీలతో టై అప్ అయింది. హుందై కూడా కారు కొనుక్కుంటే ఫస్ట్ ఈఎంఐ తామే కడతామంటూ ఆఫర్ ఇస్తోంది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా ''విష్ బాక్స్ 2.0''ను ప్రచారం చేస్తోంది. తమ కష్టమర్లను ఆర్థికంగా ఆదుకుంటామంటూ భరోసా ఇస్తోంది. మరికొన్ని కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నాయి. యూకేలో ఫియట్, అల్ఫా రోమియో కంపెనీలు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఒకవేళ కారు కొనుక్కున్న తర్వాత 12 నెలల్లోపు ఉద్యోగం పోతే.. మొదటి ఏడు నెలల పాటు ఆ కారు కొన్న వ్యక్తి ఈఎంఐలను మాఫీ చేసేస్తాయి. ఇది ఆరంభం మాత్రమేనని, ఇలాంటి ఆఫర్లను మిగిలిన కంపెనీలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని డైలీ మెయిల్ కథనాన్ని ప్రచురించింది. దీంతోపాటు ''మీ పాత కార్లకు సరసమైన ధరలు కొనబడును. కొత్త కార్లు తక్కువ ధరకే లభించును.'' అంటూ ప్రకటనలు కూడా గుప్పిస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm