హైదరాబాద్: ఏపీలో ఆగస్టు 3న పాఠశాలలను తెరవబోతున్నట్టు అక్కడ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే తెలంగాణలో స్కూల్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయనే దానిపై మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో పాఠశాలలు జూలై రెండోవారంలో ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆమె తెలిపారు. పదోతరగతి పరీక్షలు జూలై 5 వరకు ఉన్నందున, ఆ తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అంశంపై త్వరలో క్యాబినెట్ సబ్కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభించే ప్రతిపాదనలు క్యాబినెట్ సబ్కమిటీ ముందు ఉంచనున్నట్టు వివరించారు. వేసవి సెలవులు ముగిసిన వెంటనే జూన్ 12 నుంచి ఉపాధ్యాయులంతా విధుల్లో చేరాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm