లక్నో: లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే ట్రాక్పై పడుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లఖీమ్పూర్ ప్రాంతానికి చెందిన భాను ప్రకాశ్ గుప్తా స్థానిక రెస్టారెంట్లో పనిచేసేవాడు. అయితే లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఇంటికే పరిమితమవుతున్నాడు. అతడిపైనే తల్లి, పిల్లలూ ఆధారపడి జీవిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో తల్లి సతమతమవుతోంది. భాను ప్రకాశ్కూ శారీరక సమస్యలు ఉన్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో కుటుంబాన్ని పోషించడం అతడికి భారమైంది. తల్లికి వైద్యం చేయించలేక అతడు వేదకు లోనయ్యాడు. బాధను భరించలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన నిర్ణయం వెనకున్న కారణాలను వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ను రాశాడు. కాగా... స్థానికుల ద్వారా ఘటన తాలూకు సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm