హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తర్వాత మాత్రమే పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ... జూన్ నెలకు సంబంధించి కొవిడ్-19 కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్-19 పరిణామాల వల్ల చలన చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తదితర సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్ర మంత్రి జావడేకర్ మంగళవారం ఆయా సంఘాల ప్రతినిధులతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా సినిమా హాళ్లను తెరవాలన్న విజ్ఞప్తిపై మంత్రి పై విధంగా స్పందించారు. దేశంలో ఉన్న 9,500 సినిమా హాళ్లలో కేవలం టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని... ఆ మేరకు భారీగా సష్టపోయినప్పటికీ లాక్డౌన్ నిర్ణయంపై సినీరంగం సంఘీభావంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడు సంవత్సరాల పాటు వడ్డీ మాఫీ, పన్నులు, సుంకాల మినహాయింపు, విద్యుత్ బిల్లుల కనీస డిమాండు ఛార్జీల మాఫీ తదితర డిమాండ్లను ఆయా సినీ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీటిని నెరవేర్చేందుకు ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని అన్న మంత్రి, వారి డిమాండ్లను సంబంధిత శాఖల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm