న్యూఢిల్లీ : నిర్మలా సీతారామన్ స్థానంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ రానున్నారా? ఈ ప్రశ్నకు ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చీఫ్గా ఇటీవలే ఐదేండ్లు పూర్తిచేసుకున్న కామత్.. వచ్చే నెలలో ఆ బాధ్యతల్ని మరొకరికి అప్పగించనున్నారు. దీంతో కామత్ ఆర్థిక మంత్రి పదవిని చేపట్టనున్నారన్న ఊహాగానాలకు ఊతమిస్తున్నది. ఇదిలా ఉంటే భారత తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న నిర్మలకు ప్రభుత్వంలో మంచి పేరే ఉన్నది. అయితే వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ సర్కారుకు ఈసారి ఆర్థిక పరిస్థితులు అస్సలు అనుకూలించడం లేదు. బీజేపీ అధికారంలోకి రాగానే జీడీపీ వృద్ధి రేటు ఆరంభంలోనే పడకెక్కేసింది. పాత పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సెగలతో బక్కచిక్కిపోయిన వృద్ధిరేటును కరోనా చంపేస్తున్నది. ఈ క్రమంలో జీడీపీ బలోపేతానికే కేంద్రం తొలి ప్రాధాన్యతను ఇస్తున్నది. అందుకే ఆర్థిక మంత్రిగా అనుభవజ్ఞుల్ని పెట్టాలని కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవహారాల శాఖను నిర్మలకే కేటాయించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ పగ్గాలను మరింత సమర్థుల చేతికి అప్పగించాలన్న నిర్ణయానికి ప్రధాని మోడీ వచ్చినట్లు తెలుస్తున్నది. ఇక అంబానీలతో ఉన్న సత్సంబంధాలూ కామత్ను ఆర్థిక మంత్రి రేసులో ముందుంచుతున్నాయి. ముకేశ్, అనిల్ అంబానీల ఆస్తుల పంపకాల్లో కామత్ పెద్ద దిక్కుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm