హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు,కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత తీవ్ర ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం అవడానికి అశోక్ చర్యలే కారణమని ఆరోపించారు. 'ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబుగారు తెలుసుకోవాలి. మా తండ్రి చితి ఆరకముందే మీరు మా బాబాయ్ అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేసి ట్రస్టుని కట్టబెట్టారని ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు చేశారు సంచయిత. అశోక్ గజపతిరాజుగారి పదవీకాలంలో తప్పుడు చర్యలు కారణంగా మాన్సాస్ ఆర్థికంగా నష్టపోయింది. విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయింది. ట్రస్టు భూములు కబ్జాలకు గురవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్ను నియమించలేదు. విశాఖ అడిషనల్ జిల్లా జడ్జి తీర్పే ఇందుకు ఉదాహరణ అని అన్నారు సంచయిత. 'మాన్సాస్ లా కాలేజీ క్యాంపస్ను ఐఎల్ఎఫ్ఎస్కు ఉచితంగా ఇచ్చేశారు. విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారు. చివరకు ఐఎల్ఎఫ్ఎస్ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. చంద్రబాబుగారు తన సహచరుడ్ని పొగిడేముందు మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలి. లేకపోతే ఇవన్ని మీకు తెలిసి మీ ఇద్దరు కలిసి చేసినవేనా అని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm