న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. కరోనా కారణంగా ఓ వైపు మారటోరియానికి అవకాశం ఇస్తూనే మరోవైపు వడ్డీ వసూలు చేయడం ఏంటని ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థికాంశాలు ముఖ్యం కాబోవని స్పష్టం చేసింది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ చేయాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆగస్టు 31 వరకు పొడిగించిన మారటోరియం కాలానికిగానూ వడ్డీ మాఫీ చేయాలంటే బ్యాంకులు రూ.2 లక్షల కోట్లు నష్టపోవాల్సి వస్తుందని ధర్మాసనానికి నివేదించింది. కాగా ఈ సందర్భంగా ఆర్బీఐపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడినట్టు సమాచారం. మీడియాకు లీకులు ఇస్తూ ఈ అంశాన్ని ఆర్బీఐ మరింత సంచలనం చేసేందుకు ప్రయత్నిస్తోంది అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఓ వైపు మారటోరియంకు అనుమతిస్తూనే మరోవైపు వడ్డీపై ఎలాంటి ఉపశమనం లేకుండా చేయడం మరింత ప్రమాదకరం అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా తొలుత మార్చి 1 నుంచి మే 31 వరకు ఈఎంఐలపై మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ తర్వాత దీన్ని ఆగస్టు చివరి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో లాక్డౌన్ సమయంలో రుణ గ్రహీతలకు కొంత ఉపశమనం లభించింది. కాగా వడ్డీ మాఫీ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ అంచనాలు రూపొందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm