విజయనగరం: ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ శత్రుచర్ల చంద్రశేఖర రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గమైన కురుపాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ చంద్రశేఖర రాజు ఆరోపించారు. వైసీపీ ఏడాది పాలనలో జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారంటూ తన కోడలు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వడం లేదని శత్రుచర్ల చంద్రశేఖర రాజు ఆరోపించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకు ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. జగన్లాగా వైఎస్ ఎప్పుడూ చేయలేదని, ఆయన పాలన బాగుండేదన్నారు. రాజశేఖర్రెడ్డి హయాంలో పార్టీలకు, కులాలకు అతీతంగా పేదలందరికీ ఇళ్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు అర్హులైన పేదలెవరికీ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సంక్షేమంపై వైసీపీ ప్రభుత్వానికి అవగాహన లేదని చంద్రశేఖరరాజు విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm