హైదరాబాద్: కరోనా పరీక్షలకు నమూనాల సేకరణను ఆరోగ్యశాఖ తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షలకు పైగా శాంపిళ్లు పెండింగ్లో ఉండటంతో వాటికి పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే కొత్తవి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు అన్ని జిల్లాల్లో నమూనాల సేకరణ 20 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో బస్సుల ద్వారా శాంపిళ్ల సేకరణ నిలిపివేశారు. కొన్ని ఆస్పత్రుల్లో అత్యవసర రోగుల నుంచి మాత్రమే రోజుకు 50వరకూ నమూనాలు సేకరిస్తున్నారు. సోమవారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో కరోనా లక్షణాలున్నా, లేకున్నా స్వాబ్ తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా శాంపిల్స్ పెరిగిపోతున్నాయి. అయితే ఎలాంటి లక్షణాలు లేనివారే ఎక్కువగా పరీక్షలు చేయించుకుంటున్నారని పరిశీలనలో తేలింది. ఇలా అందరి నుంచి నమూనాలు సేకరించడం వల్ల నిజంగా వైరస్ సోకినవారిని గుర్తించడం ఆలస్యమవుతోంది. కాబట్టి సోమవారం నుంచి కేవలం కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే టెస్ట్ చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm