హైదరాబాద్ : కరోనా నివారణకు విధిగా మాస్కు ధరించాలని రాష్ర్ట ప్రభుత్వం చెబుతున్న విషయం విదితమే. కానీ ఈ నిబంధనను ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కు ధరించని వారిపై మే, జూన్ నెలల్లో 5,500 కేసులను సైబరాబాద్, రాచకొండ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51(బీ) కింద నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి మాస్కులు ధరించని వారిని గుర్తిస్తున్నారు. మాస్కు ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 3 వేల కేసులు నమోదు కాగా, మిగిలిన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదు అయ్యాయి. మాస్కు ధరించని వారితో పాటు ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కూడా కృత్రిమ మేధస్సు ద్వారా గుర్తిస్తున్నారు. ఇది మొదట్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తర్వాత.. రాష్ర్ట వ్యాప్తంగా విస్తరించారు.
Mon Jan 19, 2015 06:51 pm