హైదరాబాద్ : భారత క్రికెట్ మహేంద్రసింగ్ధోనీలాంటి ఆటగాడిని పొందగలిగినందుకు సంతోషంగా ఉందని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. వికెట్ కీపర్, బ్యాట్స్మన్ ఎంఎస్ ధోని ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హెలిక్యాప్టర్ షాట్ స్పెషలిస్ట్కు బర్త్ డే విషెస్ చెప్పిన దాదా జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తాను జట్టులోకి ధోనీని ఎంపిక చేసుకున్నప్పుడు అతడి సామర్థ్యాన్ని గ్రహించానని వెల్లడించారు. కానీ, అతడు తనంతట తాను ఎప్పటికప్పుడు ఆటతీరును మెరుగుపరుచుకుంటూ ఎదగాడన్నారు. టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్తో గంగూలీ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో మంగళవారం పోస్ట్ చేసింది. ప్రపంచ క్రికెట్లోని గొప్ప ఆటగాళ్లలో ధోనీ ఒకడని దాదా కితాబిచ్చారు. అతడు మ్యాచ్ను ముగించే విధానం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని, అదీ ధోనీ స్పెషాలిటీ అని పేర్కొన్నారు. తాను కెప్టెన్గా ఉన్నప్పుడు ధోనీ థర్డ్ డౌన్లో ఆడాడని, 2005 లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 140 పరుగులు సాధించాడని గుర్తుచేశారు. షాట్స్ కొట్టగల సామర్థ్యం చూసే ధోనీని బ్యాటింగ్కు ముందు పంపించేవాడినన్నారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడని గంగూలీ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm