న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం జూలై 31 వరకు పాఠశాలలు మూసే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, పరిస్థితులనుబట్టి ఈ నెల 27 నుంచి విద్యా సంస్థలను పునరుద్ధరిస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు వరకు స్కూళ్లను తెరువకపోవడమే మంచిదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత మరింతగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల వరకు స్కూళ్లు తెరుచుకునే అవకాశం లేదని నిఫుణులు చెబుతున్నారు. స్కూళ్లను పునరుద్ధరించడం లేదా పిల్లలు పాఠశాలకు వెళుతున్నారా అన్నది ప్రస్తుతం అత్యవసరం కాదని డాక్టర్ సుజానా బ్రింక్మన్ తెలిపారు. స్కూళ్లలో చదివే విద్యార్థులు తమ తరగతి స్థాయిలకన్నా వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని ఆమె చెప్పారు. జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో స్కూళ్లు తెరిచారని, అయితే అక్కడి పరిస్థితులతో దేశంలోని పరిస్థితులను పోల్చలేమన్నారు. ఇక్కడి తరగతులు పెద్ద సంఖ్యలో విద్యార్థులతో నిండి ఉండటం, దేశంలోని తక్కువ స్థాయి వనరులు దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm