హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రైతులతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. కథలాపూర్, మేడిగడ్డ మండలం నుంచి రైతులు ఈ సమావేశానికి రానున్నారు. శనివారం సాయంత్రం నియంత్రిత సాగు, రైతుబంధు, రైతువేదికల నిర్మాణంతో పాటు పలు వ్యవసాయ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా నాటికి రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వేదికల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, దసరాలోగా వాటి నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలని సూచించారు. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలవుతాయని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm