హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఇవాళ రైతులతో సమావేశం కానున్నారు. ప్రగతి భవన్ వేదికగా కథలాపూర్, మేడిగడ్డ మండలం ప్రాంతాలకు చెందిన రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్ట్రంలో నియంత్రిత పంట సాగు, రైతుబంధు, రైతువేదికల నిర్మాణంతో పాటు పలు వ్యవసాయ అంశాలపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం ఇవాళ రైతులతో భేటీ అవుతున్నారు. రైతులు తమ సమస్యలపై విస్తృతంగా చర్చించుకోవడానికి వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదిక నిర్మాణం చేపడుతోంది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. ఈ పనులను వేగవంతం చేయాలని నిన్న జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులతో సమావేశమై పంట సాగు దిగుబడితో పాటు మార్కెటింగ్ కు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రైతు వేదికలు ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దసరాలోగా వాటి నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలని సూచించారు. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలవుతాయని అన్నారు. ఇక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా పలు పంటల సాగు, నీటి వనరులపై చర్చించనున్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm