హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన ఓ వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించిన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని కుటుంబసభ్యులు ఆటోలో తరలించారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనే అంశంపై కేంద్రం నుంచి మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, అవన్నీ పక్కనపెట్టి ఇలా ఏకంగా ఆటోలో తరలించారంటూ ప్రచారం జరిగింది. ఈ ఘటనపై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి విచారణకు ఆదేశించింది. విచారణ కమిటీ తమ మధ్యంతర నివేదికను సమర్పించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు. విచారణ కమిటీ మధ్యంతర నివేదిక ప్రకారం జూలై 10న నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మూడు కరోనా మరణాలు, ఒక సాధారణ మరణం చోటుచేసుకున్నాయి. కోవిడ్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత వాటిని మార్చురీ సిబ్బంది డిస్పోసల్లో శవాలను ఉంచారు. హాస్పిటల్ పరిపాలనా సిబ్బంది కోవిడ్ కేసుల నిర్వహణ హడావిడిలో ఉన్న తరుణంలో, మార్చురీ నుండి మొదట రెండు శవాలను అంబులెన్సు లలో పంపారు. మిగిలిన రెండిటికోసం అంబులెన్సులు వచ్చేలోపు భీంగల్ నివాసికి సంబంధించిన శవం తాలూకు బంధువులు తమ స్వంత ఆటో ఉన్నదని, శవాన్ని నిజామాబాద్ లోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని మార్చురీ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి తీసుకొని వెళ్లి, నిజామాబాద్ లోని ఒక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనదని పేర్కొన్నారు. మార్చురీ సిబ్బందికి నోటీసులు జారీ చేశామని, పూర్తి నివేదిక అందిన తరువాత సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ చెప్పారు. ఇక ముందు ఇటువంటి తప్పిదాలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm