అమరావతి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. కజకిస్తాన్లో చిక్కుకున్న వైద్య విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు. ఇండియాకు విమానాలు లేవనడంతో గత 3 రోజులుగా 2 వేలమంది విద్యార్థులు విమానాశ్రయంలోనే పడిగాపులు పడుతున్నారన్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 250 మంది వైద్య విద్యార్థులు కజకిస్తాన్లో ఆన్లైన్ పరీక్షలను పూర్తిచేసి రాష్ట్రానికి పయనమయ్యారని లేఖలో నిశితంగా ఆయన వివరించారు. ''స్వరాష్ట్రాలకు పంపేందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.45 వేలు కళాశాల యాజమాన్యం వసూలు చేసింది. కరోనా విలయతాండవం నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కజకిస్తాన్ నుండి వైద్య విద్యార్థులను స్వస్థలాలకు చేర్చండి'' అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm