హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్య ప్రక్రియలను జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. దీంతో దీంతో తెలంగాణలో కూడా అలాగే చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్కు మీడియా, సోషల్ మీడియా వేదికగా సూచించారు. తాజాగా ఇదే విషయమై మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చాల్సిందేనని కేసీఆర్ను ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ కోరినా, కోరకపోయినా ప్రతిపక్షాలన్నీ ఇదే డిమాండ్ చేస్తున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పొన్నం గుర్తు చేశారు. ప్రతిరోజు పారదర్శకంగా కరోనా టెస్టులు జరిపించాలని.. అలాగే బులెటిన్లో టెస్టుల వివరాలు కూడా ప్రకటించాలని కేసీఆర్ సర్కార్ను ఆయన కోరారు. టెస్టులు చేయకపోవడం వల్ల జిల్లా కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షలు జరిపి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పొన్నం కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm