హైదరాబాద్ : కరోనా పుణ్యమా అని సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో వినోదరంగంలో కొత్త ఒరవడికి బీజం పడింది. వీడియో కంటెంట్ అందించే ఓటీటీ ఫ్లాట్ఫామ్ల వైపు సినీ రంగం పరుగులుపెడుతుంది. అయితే, ఇందులో అసభ్యకర సంభాషణలు, సన్నివేశాలు యథేచ్ఛగా ప్రసారం అవుతున్నాయి. ఇందుకు వీటిపై నియంత్రణ లేకపోవడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రస్తావించారు. ఓటీటీ ఫ్లాట్ఫాంలో వస్తున్న కంటెంట్ పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటీటీ ద్వారా విడుదల అవుతున్న సినిమాలపై స్వీయనియంత్రణ ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ మేరకు ఫిక్కీ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నియంత్రణలేని ఓటీటీ ఫ్లాట్ఫామ్లలో వచ్చే కంటెంట్ కొన్నిసార్లు అభ్యంతరకరంగా ఉంటోందని పీయూష్ గోయల్ అన్నారు. దేశం, సమాజాన్ని కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అసహానాన్ని వ్యక్తం చేశారు మంత్రి. కొన్ని చిత్రాలు కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. సృజనాత్మక వ్యక్తీకరణను స్వాగతిస్తానని, అదే సమయంలో విదేశాల్లో రూపొందుతున్న కంటెంట్ అనువదించేందుకు ఓ హద్దు ఉంటుందని గోయల్ అన్నారు. ఇకపై భారతీయ సంస్కృతి, సమాజం, నైతిక విలువను దృష్టిలో ఉంచుకుని మంచి సినిమాలను అందించాలని, చిత్రీకరణలో స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm