ఙ్ఞానపీఠమధిరోహించి సారస్వత సీమలలో విహరించావు నీ కవితలో రాజసమున్నది నీ పలుకులో రసరాజమున్నది
చైతన్యకిరణాలు ప్రసరించి కవితాసుమాలు విరచించి తెలుగు కవితా నందనంలో కర్పూరవసంతమై నిల్చినావు
గేయమైనా, వచన రచనైనా గజలైనా, చలనచిత్ర గీతమైనా నీ కలం విరజిమ్మింది ఇక్షురసార్ణవ సారమే
ప్రపంచపదులతో మా ప్రపంచమంతా నిండావు మంటల్లో పడిన మానవుడిపై పగలే వెన్నెల కురిపించావు తరతరాల తెలుగు వెలుగును రేపటి వైపు నడిపించావు
కలసి నడిచే కాలంలో తేజస్సే తపస్సుగా భావించాలని తమస్సులో వెలుతురై జీవించాలని కాలం అంచుమీద కవిత్వమై బ్రతకాలని కలలుగన్న తాపసి ఓ కవివరేణ్య రసికశిఖామణి అందుకో ఈ నీరాజనం. (జూలై 29 న డా.సినారె జయంతి సందర్భంగా...)