- అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి - మేయర్
నవతెలంగాణ కంటేశ్వర్/నిజాంబాద్ సిటీ
పేదలకు అండగా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే సుస్థిర రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ భారతదేశానికి అందించారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఫులాంగ్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ బి పాటిల్, పలువురు అధికారులు సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, భాషలు, ఆచారాలు, కులాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నప్పటికీ వారినందరిని ఒక్క తాటిపై నిలిచే విధంగా అందరికి సమాన అవకాశాలు కల్పించడంతోపాటు పేదలకు, అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్లు అందించడానికి, తద్వారా భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగడానికి ఆయన సుస్థిర రాజ్యాంగాన్ని మనకోసం రాశారని ప్రస్తుతించారు. తద్వారా పరదేశీయుల నుండి విముక్తం అయిన తర్వాత స్వతంత్ర భారతదేశం అప్పటివరకు ఉన్న ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించి ఎన్నో దేశాలకు ఆదర్శంగా అభివృద్ధిలో ముందుకు వెళ్లకలుగుతున్నదని తెలిపారు. మనకు స్వాతంత్ర్యం కంటే ముందు అభివృద్ధిలో ఉన్న దేశాలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగం వల్ల మనం మంచి స్థితిలో ముందుకు సాగుతున్నా మన్నారు. ఆయన ఆశయాలే స్ఫూర్తిగా మనమంత ముందుకు సాగడం తోపాటు ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానికి పేద ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తద్వారా దేశం ప్రాంతం అభివృద్ధి కావడానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు.మన ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వాటిని అర్హులకు అందే విధంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నదని సూచించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్ మేయర్
అందరూ సమానంగా ఎదగడానికి శోధించి, సమీకరించి, పోరాడి రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్ అని నగర మేయర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, బడుగు వర్గాల నుండి తామర పువ్వు లాగా ఉద్భవించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. తన జీవితం మొత్తం భోజనం లేకున్నా కూడా చదువుకే కేటాయించి తన ప్రజలకు విముక్తి కల్పించడానికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తన ప్రతి పైసా గ్రంథాలయం కోసం వెచ్చించారని తెలిపారు. అణగారిన తన ప్రజల కోసం తరతరాలు లబ్ది చేకూరే విధంగా ఏదైనా చేయాలనే తపన పడ్డారన్నారు. యువత ఆయన రచించిన రాజ్యాంగంలోని అంశాలకు అనుగుణంగా వాటిని త్రికరణశుద్ధిగా అమలు జరిగే విధంగా ముందుకు సాగాలని పెడదోవ పట్టకుండా మహిళల పట్ల అసభ్యంగా, అఘాయిత్యాలు చేయకుండా చెడుగా ప్రవర్తించకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఇందుకు అక్షరాస్యత ఎంతైనా అవసరమని, చదువుతోపాటు పిల్లలకు నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ఇతర దేశాలకు ఆదర్శంగా జీవించగలుగుతాం అని పిలుపునిచ్చారు.అనంతరం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్ డి ఓ రవి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది జ్యోతి వెలిగించి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఫులాంగ్ చౌరస్తా వద్ద స్వతంత్ర అమృతోత్సవ భారత్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, పలు సంఘాల నాయకులు, ప్రతినిధులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 05:51PM