- ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ-మంథని
మంథని మండలంలోని ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మంథని కవిత అనే బాలింత మృతికి బాధ్యులైన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు బూడిద గణేష్,బూడిద తిరుపతిలు డిమాండ్ చేశారు. శుక్రవారం మంథని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల రెండవ తేదీన గ్రామానికి చెందిన బాలింత పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆ సమయంలో ఆమె భర్త మంథని సాగర్ అదే గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కట్టెకోల లక్ష్మిని ఫోన్ లో సంప్రదించగా, సకాలంలో ఆమె స్పందించక పోవడమే కాక బాధితురాలి భర్తపై దురుసుగా ప్రవర్తించారని,ఆమెకు సకాలంలో వైద్యం అందక ఈ నెల 5వ తేదీన బాలింత మృతి చెందిందనివారు పేర్కోన్నారు.గ్రామంలో విధులు నిర్వహించే ఆశా కార్యకర్త నిబంధనల ప్రకారం బాలింతలకు స్వయంగా దగ్గరుండి డెలివరీ చేయించాల్సి ఉండగా,తన విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఒక నిరుపేద దళిత బాలింత మృతికి కారణమైందని వారు ఆరోపించారు.కాగా ఆశా కార్యకర్త విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే తన భార్య మరణించిందని మృతురాలి భర్త మండల వైద్యాధికారిని శంకర దేవిని కలిసి ఫిర్యాదు చేసిన కూడా ఇంతవరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని,బాలింత మృతికి కారణమైన ఆశ కార్యకర్తను వెంటనే విధుల నుండి తొలగించాలని, సంబంధిత వైద్య ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.అదేవిధంగా మంథని మండల వైద్యాధికారిని శంకరా దేవి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు అందిస్తున్నటువంటి వైద్య సేవలను సంబంధిత వైద్యాధికారిణి పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు కుంటూపడుతున్నాయని, తక్షణమే ప్రభుత్వం స్పందించి,విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మండల వైద్యాధికారిపై,ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ఆశ కార్యకర్తపై వెంటనే చర్యలు తీసుకోవాలని,లేనియెడల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మంథని లింగయ్య,బూడిద రాజు,ఇరుగురాల ప్రసాద్,మృతురాలి భర్త మంథని సాగర్,తదితరులు పాల్గొన్నారు.