ఆగస్టు 29 భారత జాతీయ క్రీడాదినోత్సవం. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే,- 74 సంవత్సరాల స్వతంత్రభారత్లో ఇప్పటికీ జాతీయ క్రీడాదినోత్సవం ప్రాధాన్యం ఏమిటో... అసలు ఏ రోజున జరుపుకొంటారో తెలియని నవయువ జనాభా చాలామంది ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.
ఏమున్నది గర్వకారణం..
ప్రపంచ జనాభాలో భారత్ స్థానం రెండు. అత్యధిక యువజన జనాభా ఉన్న దేశాలలో భారత్ దే అగ్రస్థానం. అయితే.. క్రీడారంగంలో మాత్రం మన పరిస్థితి మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే దిగదుడుపే. రియో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం 57 మాత్రమే. అంతేకాదు, 2014 ఆసియా క్రీడలు, 2018 కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో సైతం చిన్న దేశాల ముందు మన స్థానం దిగదుడుపే. క్రీడా రంగంలో భారత్ ఈ వెనుకబాటు తనానికి అసలు కారణం ఏంటో చూస్తే విస్తుపోవడం మనవంతే అవుతుంది.....
ఎక్కడవేసిన గొంగళి అక్కడే..
సంవత్సరాలు జరిగిపోతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా భారత క్రీడారంగ ప్రగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. 74 సంవత్సరాల స్వతంత్ర భారత్... శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో ప్రగతి సాధించిన దేశం, అంతేకాదు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ప్రపంచ దష్టిని ఆకర్షిస్తున్నది. అయితే.. ఇదంతా నాణేనానికి ఓవైపు మాత్రమే. క్రీడాపరంగా భారత్ ప్రగతి చూస్తే.. రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అని చెప్పక తప్పదు. మన పొరుగుదేశం చైనాతో పోల్చిచూస్తే.. ఒలింపిక్స్లో భారత్ పరిస్థితి తీసికట్టే. జనాభాలో ప్రపంచంలోనే చైనా అతిపెద్ద దేశం.
దేశ జనాభాకు తగ్గట్టుగానే క్రీడారంగంలో చైనా కళ్లు చెదిరే ప్రగతి సాధించింది. అమెరికా లాంటి సూపర్ పవర్ కే సవాలు విసిరే పరిస్థితికి ఎదిగింది. అదే.. జనాభా పరంగా ప్రపంచం లోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. రియో ఒలింపిక్స్ పతకాల పట్టిక 57వ స్థానంలో ఉందంటే.. మన పరిస్థితి ఎంత దయనీయమో మరి చెప్పాల్సిన పనిలేదు.
అత్యధిక యువజన జనాభా
ప్రపంచంలోని 204 దేశాలలో అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం భారత్. దేశ జనాభాలో 60శాతం మంది యువజనులే. అయినా క్రీడలంటే ఏమాత్రం ఆసక్తిలేదు. వాలంటైన్స్ డే, మైకేల్ జాక్సన్ల పుట్టిన రోజుల గురించి ఉన్న అవగాహన.. జాతీయ క్రీడాదినోత్సవం గురించి లేకపోవడం బాధాకరం.
వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బందంతో ఇటీవలే నిర్వహించిన ఓ సదస్సులో భారత క్రీడారంగం వెనుకబాటుకు గల కారణాలు, విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
130 కోట్ల భారత జనాభాలో కేవలం 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఇటీవలే నిర్వహించిన తాజా సర్వే ద్వారా తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే.
అంతేకాదు, దేశజనాభాలో 3.27శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడయ్యింది.
క్రీడలతో వ్యాపారం..
క్రీడలంటే ఒకప్పుడు మానసిక ఉల్లాసం కోసం ఆడే ఆటలు మాత్రమే. అయితే, ప్రపంచీకరణ పుణ్యమా అంటూ.. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ లాంటి టీవీ ఫ్రెండ్లీ ఆటలతో.. క్రీడారంగం కూడా బహుళజాతి సంస్థల వ్యాపారవాహకంగా మారిపోయింది.
క్రికెట్ అంటే ఇప్పుడు పరుగులు, వికెట్లు, క్యాచ్లు, రికార్డులు ఏమాత్రం కాదు. ప్రసార హక్కులు, కిట్ బ్యాగులు, లోగో హక్కులు, ఇన్ స్టేడియా హక్కులు, జట్టు, క్రీడాకారుల వ్యక్తిగత ఎండార్స్మెంట్లు.. ఇలా ఏదిచూసినా కోట్ల రూపాయల వ్యాపారమే.
క్రికెటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ బ్యాటు పట్టి కోట్లకు పడగలెత్తినవారే. చివరకు టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు.. ఆటతో కోట్ల కోటలు కట్టినవారే. బహళజాతి సంస్థల అండదండలు, మీడియా ఫ్రెండ్లీగా ఉండే.. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఒకటి రెండు క్రీడల దెబ్బకు మిగిలిన క్రీడలన్నీ విలవిలలాడి పోతున్నాయి. ప్రభుత్వాలు సైతం తమకు ఆదాయం, ప్రచారం తెచ్చిపెట్టే క్రీడల్ని, క్రీడాకారులను మాత్రమే ప్రోత్సహిస్తూ మిగిలిన క్రీడలను, క్రీడాకారులను చిన్నచూపు చూస్తున్నాయి.
జాతీయస్థాయి క్రీడలు కనుమరుగు
దేశంలో క్రీడలు ఎన్నిరకాలు ఉన్నా.. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్థాయిలో జాతీయ పోటీలు నిర్వహించడం ఓ సాంప్రదాయంగా ఉండేది. ఈ పోటీల నిర్వహణ కోసం జాతీయ ఒలింపిక్ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలు సహాయ సహకారాలు అందచేస్తూ ఉండేవి. అయితే, లాభసాటి లీగ్ వ్యాపారం భారత క్రీడారంగంలోకి చొరబడటంతో జాతీయ పోటీల నిర్వహణ తూతూమంత్రంగా మారిపోయింది. భారత క్రీడారంగ మూలాలే బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది.
దీనికి తోడు క్రీడలు ఉమ్మడి జాబితా అంశం కావడంతో ఓ స్పష్టమైన క్రీడావిధానం అంటూ లేకపోడం భారత క్రీడా రంగాన్ని కుదేలయ్యేలా చేస్తోంది. అదీ చాలదన్నట్లుగా.. ఏడాది నుంచి ఎనిమిదేళ్ల పిల్లలను క్రీడల పట్ల ఆకర్షించేలా చేయడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఎలాంటి విధానాలు లేవని మాజీ క్రీడా దిగ్గజాలు అంటున్నారు.
దశాబ్దాల నాటి క్రీడామౌలిక సదుపాయాలతో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో ఏవిధంగా రాణించ గలరని భారత హాకీ మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఎం.పీ.గణేశ్ ప్రశ్నిస్తున్నారు.
మైదానాలు లేని పాఠశాలలు..
పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్నమాట.. నేటితరం పాఠశాలలకు ఏ మాత్రం వర్తించదు. చిన్నచిన్న నగరాలు, పట్టణాలలో సింగిల్ బెడ్ రూమ్ పాఠశాలలు, డబుల్, ట్రిపుల్ బెడ్ రూం కళాశాలలను చూస్తుంటే క్రీడారంగంలో భారత్ ఏగతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు.
దేశంలోని క్రీడారంగ అభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలురకాల నిపుణుల కమిటీలలో సభ్యుడిగా ఉన్న భారత హాకీ మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ సైతం... ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలు, పాఠశాలలు, కళాశాలలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస క్రీడా సౌకర్యాలు లేని పాఠశాలల్లో చదివే నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత మాజీ క్రీడాదిగ్గజాలు, అర్జున అవార్డీలు వాపోతున్నారు.
క్రీడలను సైతం నిర్భంద పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడావ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పురానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ సంస్కతి, స్మార్ట్ ఫోన్ విష కౌగిలి, పశ్చిమదేశాల అనుకరణలో ముందున్న మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకుంటే క్రీడాసంస్కతి ఎండమావిగానే మిగిలి పోతుంది.
నిధుల కేటాయింపు అంతంతే...!
కేంద్రంలోను, తెలుగు రాష్ట్రాలలోనూ వార్షిక బడ్జెట్ల సమర్పణ తంతు చూస్తే మన ప్రభుత్వాలకు క్రీడలంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎప్పటిలానే క్రీడా రంగానికి అరకొర మొత్తాలను మాత్రమే ఆర్థికమంత్రులు విదిలించి.. క్రీడలకు తాము ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో చెప్పకనే చెప్పారు.
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూపోతూ ఉన్నా.. క్రీడారంగానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా అరకొర కేటాయింపులతో, విదిలింపులతోనే సరిపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు.. నిధులు మిక్కుటంగా ఉన్న తెలంగాణా, నిధులో రామచంద్రా అంటూ కేంద్రప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ తమతమ ప్రాధమ్యాలకు అనుగుణంగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకొన్నాయి.
యథా కేంద్రం... తథా తెలుగు రాష్ట్రాలు..
భారత ప్రభుత్వం 2016 - 17 సంవత్సరానికి రూపొందించిన కేంద్ర బడ్జెట్ ను... 21 లక్షల 47వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. దేశంలోని 29 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 125 కోట్ల జనాభా అవసరాలకు తగ్గట్టుగా మాత్రం క్రీడారంగానికి నిధులు కేటాయించలేకపోయారు.
సన్నాహాలు, శిక్షణ కార్యక్రమాలను దష్టిలో ఉంచుకొని రూ.350 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెంచారు.
ఖేలో ఇండియా కార్యక్రమానికి గత బడ్జెట్ కంటే ప్రస్తుత బడ్జెట్లో 140 కోట్ల రూపాయలు పెంచారు. ఇక దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారుల అన్వేషణ కార్యక్రమం కోసం కేవలం రూ.50లక్షల రూపాయలు మాత్రమే కేటాయించారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
మొత్తం రూ.21 లక్షల 47వేల కోట్ల రూపాయల బడ్జెట్లో క్రీడారంగానికి రూ.1943 కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే... క్రీడారంగానికి మనం ఇస్తున్న ప్రాధాన్యం ఏపాటిదో అర్థమవుతుంది.
తెలంగాణాలో అలా...
భారత దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణ 2016 -17 ఆర్థిక సంవత్సరానికి రూ. లక్షా 49వేల 646కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడితే.. క్రీడారంగానికి కేటాయించింది కేవలం రూ.37 కోట్లు మాత్రమే. ఇందులో... తెలంగాణా క్రీడాప్రాధికార సంస్థ నిర్వహణ, దాని అనుబంధ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలకే సింహభాగం ఖర్చయి పోతుంది. అదిపోను మిగిలిన భాగం నుంచే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, ఇతర క్రీడాభివద్ధి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. క్రీడామైదానాల ఆధునీకరణకు రూ.10 కోట్లు, క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకు రూ.9 కోట్లు , తెలంగాణా స్పోర్ట్స్ అథారటీ నిర్వహణకు రూ.18 కోట్లు కేటాయించారు.
తెలుగు రాష్ట్రాలు దొందూదొందే..
రియో ఒలింపిక్స్ పతకాల పట్టిక 57వ స్థానంలో భారత్ నిలిస్తే.... కేరళలో ముగిసిన 35వ జాతీయ క్రీడల పతకాల పట్టిక 12వ స్థానానికి తెలంగాణా, 18వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పడిపోయాయి. కంటితుడుపు కేటాయింపులతో క్రీడా రంగంలో అత్యుత్తమ ఫలితాలతో పాటు పతకాల పంట పండించడం అసాధ్యమని ప్రభుత్వాలు, అధినేతలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
దయనీయ స్థితిలో..
క్రీడారంగంలో భారత్మాత్రం అట్టడుగు స్థాయిలోనే కొట్టిమిట్టాడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్, ప్రపంచ నంబర్వన్ గేమ్ ఫుట్బాల్లో భారత పరిస్థితి దయనీయంగా తయారయ్యింది. ఒలింపిక్స్లో 204 దేశాలు పోటీపడుతుంటే.. పతకాల పట్టికలో భారత్ స్థానం 57 మాత్రమే. అంతేకాదు.. ప్రపంచ ఫుట్ బాల్లో మన ర్యాంకు 101గా ఉందంటే.. మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
చివరకు 77 దేశాల కామన్వెల్త్ గేమ్స్, 45 దేశాల ఆసియా క్రీడల్లో సైతం.. భారత పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. జాతీయ క్రీడ హాకీలో సైతం భారత మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. క్రికెట్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ లాంటి ఒకటి రెండు క్రీడల్లో భారతజట్టు, క్రీడాకారులు రాణిస్తున్నా అది నామమాత్రమే.
ఏదిఏమైనా.. జన జీవితంలో క్రీడాసంస్కతి ఓ ప్రధాన భాగం కానంత వరకూ జాతీయ గీతం, జాతీయ పతాకంతో సమానంగా జాతీయ క్రీడాదినోత్సవానికి ప్రాధాన్యం ఇవ్వనంత వరకూ జాతీయ క్రీడాదినోత్సవం తూతూమంత్రంగానూ, ఓ ప్రహసనంగానూ మిగిలిపోకతప్పదు.
మహేంద్రసింగ్ ధోనీని మరువగలమా?
భారత క్రికెట్లో జార్ఖండ్ డైనమైట్ మహేం ద్రసింగ్ ధోనీ శకం ముగి సింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ పరిపూర్ణ రిటైర్మెంట్ ప్రకటించడంతో కోట్లాది మంది అభిమానులు తల్లడిల్లిపోయారు.
ప్రారంభం ఎలా ఉన్నా... కెరియర్ ముగింపు ఘనంగా ఉండాలని గొప్పగొప్ప క్రికెటర్లు కోరుకోడం సహజమే. అయితే... క్రికెట్ నుంచి ఘనంగా వీడ్కోలు తీసుకొనే అవకాశం సచిన్ టెండుల్కర్ లాంటి అతికొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. భారత క్రికెట్కు 15 సంవత్సరాల పాటు అసమాన సేవలు అందించిన జార్ఖండ్ ఆణిముత్యం, భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి గొప్పగా వీడ్కోలు తీసుకొనే అవకాశం చిక్కలేదు. ముందుగా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్.. ఆ తర్వాత అంతర్జాతీయ వన్డే, టీ-20 ఫార్మాట్ల నుంచి నిష్క్రమించక తప్పలేదు.
అరుదైన, అసాధారణ క్రికెటర్...
సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మేటి క్రికెటర్లంతా మహానగరాల నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తారాస్థాయికి చేరినవారే. అయితే.. క్రికెట్ పునాదులు , మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని జార్ఖండ్ లాంటి మారుమూల రాష్ట్రం నుంచి భారత క్రికెట్లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన జులపాలజట్టు రాంచీ రాంబో 15 సంవత్సరాల పాటు భారత క్రికెట్కు మూలస్తంభంలా నిలవటం అపూర్వం, అసాధారణం.
ముషారఫ్ నే మెప్పించిన ధోనీ...
భారత క్రీడాచరిత్రను ఓసారి తిరగేస్తే...అలనాడు జర్మన్ నియంత హిట్లర్ను ధ్యాన్చంద్ తన ఆటతీరుతో మంత్ర ముగ్దుడ్ని చేస్తే.. పాక్ నియంత పర్వేజ్ ముషారఫ్ను మహేంద్ర సింగ్ ధోనీ తన జులపాల జట్టుతో కట్టిపడేశాడు. తన దూకుడు, విలక్షణ ఆటతీరుతో అభిమానిగా మార్చుకొన్నాడు.
దేశవాళీ క్రికెట్ ద్వారా భారతజట్టులోకి 2004లో అడుగు పెట్టిన ధోనీ.. బంగ్లాదేశ్ గడ్డపై వన్డే అరంగేట్రం చేసినా... ఆ తర్వాత కానీ నిలదొక్కుకోలేకపోయాడు.
2014 డిసెంబర్లో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఆ తర్వాత ఐదేళ్ళ పాటు ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో భారతజట్టు సభ్యుడిగా కొనసాగాడు.
ఇంగ్లండ్ వేదికగా ముగిసిన 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ ప్రత్యర్థిగా తన ఆఖరి అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత నుంచే ధోనీ రిటైర్మెంట్పై ఊహాగానాలు జోరందుకొన్నాయి. కొద్దివారాల పాటు తనకుతానుగా క్రికెట్కు దూరమై... భారత సైనిక దళాలకు సేవలందించాడు.
రిటైర్మెంట్ ఊహాగానాల నడుమే...
ఐపీఎల్ 13వ సీజన్కు సన్నాహాలు ప్రారంభించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన 2020 టీ-20 ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని భావించినా..
కరోనా మహమ్మారి దెబ్బతో అంచనాలు తలకిందులయ్యాయి.
కూల్ కూల్ కెప్టెన్...
టీ-20 ప్రపంచకప్ సైతం రద్దుల పద్దులో చేరిపోడంతో... వేరే దారిలేని ధోనీ అర్థంతరంగా తన అంతర్జాతీయ కెరియర్ ను కరోనా కాలంలో ముగించక తప్పలేదు.
భారత్కు 350 వన్డేలు, 98 టీ-20 మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించిన ధోనీకి... కెప్టెన్గా 2007 టీ-20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలు అందించిన అరుదైన ఘనత, రికార్డులు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో భారత్ను ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్కు చేర్చిన ఘనత సైతం ధోనీకే దక్కుతుంది.
మొత్తం 350 వన్డేల్లో 10 వేల 773 పరుగులతో 50.57 సగటు సాధించిన ఘనత ఉంది. ఇందులో 10 శతకాలు, 73 అర్థశతకాలు ఉన్నాయి. 98 టీ-20 మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో సహా 1617 పరుగులతో 37.60 సగటు సాధించాడు.
ఐదో భారత క్రికెటర్ ధోనీ...
2019 జనవరిలో 10వేల పరుగుల వన్డే క్రికెట్ మైలు రాయిని చేరడం ద్వారా ధోనీ అరుదైన ఘనతను సాధించాడు. ఈ రికార్డు సాధించిన ఐదవ భారత క్రికెటర్గా నిలిచాడు. ధోనీకి ముందే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్, దాదా సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ల సరసన నిలిచాడు.
ధోనీలాంటి అసాధారణ, అపూర్వ క్రికెటర్ మరొకరు భారత క్రికెట్లోకి రావాలంటే ఎంతకాలం వేచిచూడాలో మరి.!
- చొప్పరపు కష్ణారావు, 84668 64969
Sat 29 Aug 21:39:23.262707 2020