దేవిప్రియను మొదటిసారి ఖమ్మంలో ఉప్పర్ పెళ్ళికి వచ్చినపుడు చూశాను. అప్పటికే నేను రన్నింగ్ కామెంటరీలో ప్రేమలో వున్నాను. మౌనంగా చూడటం తప్పిస్తే పెద్దగా మాట్లాడింది ఏమీలేదు. తన కవిత్వంలానే చాలా మృధుభాష దేవి. తనను ఒక చట్రంలో యిమడ్చడం ఒక ఛత్రం కింద నిలపడం చాలా కష్టం. పాత్రికేయ వృత్తి, సినిమా, కవిత్వం, గీత రచన ఇలా అన్నింటిని అలవోకగా అమిత సీరియస్గా నిర్వహించినవాడు దేవిప్రియ. నాటి అమ్మచెట్టు నుండి యింకొప్పుడు దాకా తన ప్రయాణం అనితర సాధ్యాం. గరబు గీతాలు, సమాజనంద స్వామి, ఇన్హా అల్లా, రన్నింగ్ కామెంటరీ, కవిత్వయాత్రలో తను యిష్టంగా చేసిన కొన్ని మజిలీలు, ప్రజాయుద్ధనౌక గద్దర్ లాంటి డాక్యుమెంటరీలు, 'జమ్ జమ్ముకి ముద్ర వెయ్యి కళ్ళ జద్ర'' లాంటి సినీ గీత రచన తన కవిత్వమనే వెండిమబ్బుకి తానే అందంగా గార్నిష్ చేసిన జరీ అంచు. కవిత్వమంటే కనిపించే అక్షరాలు వినిపించే శబ్దాలు మాత్రమే కాదు కవిత్వమంటే రెండు విరుపులు రెండు చదువులు మాత్రమే కాదు కవిత్వమంటే / పందిరి మీదకు ద్రాక్షను పాకించడం పద్మవ్యూహ్యంలో నుండి బయటపడే ప్రయత్నం చేయడం నీటిలోకి నిటారుగా దిగిన కత్తులు నిశ్శబ్దంగా చీల్చుకుపోవడం పియానో మెట్ల మీద సమ్మోహన రాగ జలపాతాలను దూకించడం కవిత్వమంటే కనురెప్పల వెనుక మూసిన నిశీధిలో చూరుకాన్ని తిప్పుతున్న చూపుడు వేలు ఇంకా చెప్పాలంటే కవిత్వం ఇంధ్రధరస్సుకి నిద్రలో కనిపించే బ్లాక్ అండ్ వైట్ స్వప్నం అని కవిత్వాన్ని నిర్వచించుకున్న దేవిప్రియ. కవిత్వంలో సారంలో ఒక తుఫాను తుమ్మెద. రూపంలో వాన గాలి అలల చిరు సంగీతం. 'ఆకాశం అవులించింది' లాంటి కథలతో సాహిత్య రంగ ప్రవేశం చేసిన దేవిప్రియకి తొలి సాహిత్య పురస్కారం అమ్మం రాసి పాడిన 'ఖసీదా'లుతోనే కలిగింది. ముస్లింలు సాంప్రదాయకంగా గ్యార్మీ పండుగ చేస్తారు. ఆ పండుగ సందర్భంలో తప్పెట్లు వాయించుకుంటూ యిండ్ల ముందుకు ఫకీర్లు వచ్చేవారు. అలా ఫకీర్లను చుట్టూ కూర్చోపెట్టుకుని దేవీప్రియ వాళ్ల అమ్మ తాను రాసిన 'ఖసేదా'లు వాళ్లు తప్పెట్లు వాయిస్తుంటే పాడేది. అది దేవిప్రియకి కలిగిన మొదటి సాహిత్య సంస్కారం. ఈ వాతావరణాన్ని దేవిప్రియ ''ఒక గుడిసె కథ''అనే కవితలో అద్భుతంగా చిత్రీకరించాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో ఓల్గా, దేవిప్రియకి క్లాస్మేట్. అప్పటికే కవిగా గొప్ప పేరు తెచ్చుకున్న సుగమ్బాబు దేవిప్రియకు గురువు లాంటి మిత్రుడు. అప్పటికే సినారే మాత్రా చంధస్సులో రాసిన ''కర్పూర వసంత రాయలు'' కాలేజి లైబ్రరీలో చదివి పరవశుడై, ఒక జ్వరం లాంటి తీవ్రతతో ''వనజా రాయలు'' పేరుతో దాదాపు రెండు వందల పద్యాలతో ఒక కావ్యం రాసేశారు. పద్య కవిత్వం... కథలలో తలమునకలుగా వున్న దేవిప్రియకి వచన కవిత్వం పట్ల ఆసక్తి కలిగించింది సుగమ్ బాబే! ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ''శిలా మురళి'' దేవిప్రియను కాలేజీ రోజులలో ఆకర్షించిన మరొక కావ్యం. 'శిలా మురళి' అనే పదబంధమే తనకొక 'కావ్యం'లా అనిపించింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు దేవిప్రియ. గుంటూరు నుంచి వచ్చే 'స్వతంత్ర సందేశ్' అనే పత్రికలో కొన్ని వారాల పాటు 'గాంధీ మార్గం' పేరుతో సమకాలీన సమస్యల మీద కవిత్వం రాశారు. ఈ గాంధీ మార్గమే తరువాత ప్రజాతంత్రలో సమాజ నంద స్వామిగా, తరువాత గరీబు గీతాలుగా పరిణామం చెందింది. గుంటూరు నుండి మద్రాసు మీదగా హైదరాబాద్కి చేరుకున్న జీవితం. నిర్మల అనే పత్రిక ఎడిటర్గా మొదలయి ప్రజాతంత్రలో పాదుకునిపోయింది. ప్రజాతంత్ర సంపాదకుడు గా దేవిప్రియ చాలా ప్రయోగాలు చేశాడు. శ్రీశ్రీ ఆత్మకథ ''అనంతం'' వెలుగు చూడటానికి దేవిప్రియనే కారణం. విఖ్యాత సంపాదకుడు కె.రామచంద్రమూర్తి ''క్రేడి'' పేరుతో ప్రజాతంత్రలో క్రీడాశీర్షిక రాసేవారు. దేవిప్రియ సమాజానంద స్వామి రాయడంతో పాటు ''దేవదాసు'' పేరుతో ''సినీ తంత్ర'' అనే శీర్షిక నిర్వహించేవాడు. పాత్రికేయుడిగా, కవిగా, సినీ రచయితగా మూడు పనులను అలవోకగా ఏక కాలంలో అనితర సాధ్యంగా నిర్వహించేవాడు దేవిప్రియ. పైగంబరగ కవిగా మొదలయిన దేవీ విప్లవ కవిత్వాన్ని అక్కున చేర్చుకున్నాడు. అయితే విప్లవ కవిత్వ ఉద్యమంలో శివారెడ్డిలుగా, గద్దర్ లాగా బిగ్గరగా పలికిన గొంతు కాదు దేవప్రియది. విప్లవోద్యమంలో తన కవిత్వం అంతా గుసగుసల స్థాయిని దాటలేదని ఆయనే ఒకచోట చెప్పుకున్నారు. అయితే ఆ గుసగుసలు కూడా ఆయన స్ఫుటంగా, ఏ శషభిషలు లేకుండా బలంగా వినిపించాడు. అడవీ నువ్వంటే నాకిష్టం రేపటి దేశానికి ఈనాటి తల్లివి నువ్వు రేపటి ఆకాశానికి ఈనాడే సూర్యపుష్ఫానివి నువ్వు ఏదో ఒక రోజు ఈ దేశాన్ని ప్లాస్టిక్ తీగల విష పుష్ప ఉద్యాన వనాల నుండి కాపడటానికి నీ సాయమే కోరుతాను అంటూ విప్లవాన్ని బలంగా కౌగిలించుకున్నాడు. విప్లవ కవిత్వ ఉద్యమంలో దేవిని తన సమకాలీన కవుల కంటే భిన్నంగా నిలబెట్టింది అతడి కవిత్వ రూపం. మిగతా విప్లవ కవులందరూ వస్తువులను మాత్రమే పట్టించుకున్నప్పుడు దేవిప్రియ వస్తువుతో పాటు రూపాన్ని కూడా చాలాబలంగా పట్టించుకున్నాడు. తుఫాను తుమ్మెద, నీటిపుట్ట, గంథకుటి యిలా తన కవిత్వ శీర్షికలన్నీ అందులో భాగమే. నీటిపుట్ట అంటే సముద్రం అని అర్థం. నిజానికి ప్రతి పదానికీ తనదయిన పుట్టుక విస్తరణ, అర్థమూ వుంటుంది. తనదయిన వ్యక్తీకరణ వుంటుంది. సముద్రాన్ని వారధి అని, శరధీ అని సంస్కృత పదాలతో కూడా సూచించవచ్చు. ఆ పదాలలో సముద్రపు అలల హౌరు ఉంటుంది. కానీ నీటిపుట్ట అనడంలో ఒక సున్నితత్వం వుంటుంది. దేవి కవిత్వం యింత సున్నితంగా వుండటానికి ప్రధానమయిన కారణం అతడు పెరిగిన తాడికొండ పరిసర ప్రాంతాలు. తాడికొండకి దగ్గరలో వున్న నెమలికన్ను, లేమల్లె లాంటి ఊళ్ల పేర్లు విన్నప్పుడు వాటి లాలిత్యానికి పడిపోయే వాడిని అని ఒక యింటర్వ్యూలో దేవిప్రియ చెప్పుకున్నాడు కూడా. దేవిప్రియలోని భావుకతని తట్టిలేపినవి తొలి ఉద్రేరకాలు చిన్ననాడు సంచరించిన ఊర్లు అంటే అతిశయోక్తి కాదూమో. తుహిన మేఘ రేణువులు పొదిగిన నీలి నీలి రెక్కలు సుతారంగా ఆడిస్తూ పొగమంచు తలుపులు చప్పుడు కాకుండా తెరచుకుని ఒక కల ప్రతి వేకువలా నా శయన మందిరంలోకి సుప్త చేతనలోకి దిగి వస్తుంది. దివ్య సుందరమయిన తన సొగసు చూడమని ఒక హంస తూలికా తల్పంలో నా కనురెప్పలను నిద్ర లేపుతుంది ఇంత సున్నితంగా కవిత్వంలోనూ, జీవితంలోనూ తడి ఆరకుండా వుండటం చాలా అరుదు. ఈ సున్నితత్వం వున్నది కనుకనే గాలి రంగును ఊహించగలిగాడు దేవిప్రియ. దేవిప్రియ కవిత్వంలో ఆమెది ప్రముఖ స్థానం. ఎంత ప్రముఖమయినది అంటే ఆమె లేకుంటే అతడు లేడు. అతడిని సాగు చేసే వాగు ఆమె. అతడి నులివెచ్చని స్పర్శ ఆమె. తన కవిత్రిమంతా ఆమెకు సముచిత స్థానం యిచ్చాడు. భావ కవులు లాగాఆమెకు దేవత స్థానం యివ్వలేదు కానీ, ఆమె లేకపోతే అతడు లేడు అనే ఎరుకను మాత్రం బలంగా ప్రకటించాడు. నిన్నలానే అనిపిస్తోంది ముప్పయి ఏడేళ్ళ తరువాత కూడా నీ నులివెచ్చని క్షణ పరిమళ స్పర్శకోసం పరితపించిన స్వప్న పరంపర నేటికీ కొనసాగుతున్నట్టే వుంది అంటాడు దేవీప్రియ. ఒంటరి యిద్దరు అనే కవితలో. తన సగం తనను విడిచి వెళ్లాక నీడ నేల మీద పడకుండా ఎండలో నడవటం ఎలా? రెండు శ్వాసలలో ఒకటి లేకుండా బతకడం ఎలా? అని తండ్లాట పడ్డాడు. పాత కళ్ల జోడు జారి కిందపడి రెండు ముక్కలయింది ఒరిగిన జేబులోంచి అయితేనేం... అతడి అంత: భిక్షువు మాత్రం స్వయం ప్రకాశం కనుక దేదీప్యమానంగా వెలుగుతూనే వుంది. ఇప్పుడు బతుకుతున్నదుందే అదే నిజమయిన మరణానంతర జీవితం దు:ఖం వేదన ఆనందం ఏదయినా కవిత్వంలో పలకవలసిందే. లేకపోతే రోజు గడవదు. మానవ చరిత్ర పుస్తకంలోని ఏ పేజీలోంచి లేచి వాలిందో ఈ పిచుక ఎంత తరిమినా నాలోంచి ఎగిరిపోదు అన్నాడు నీటిపుట్టులో పిచ్చుక శీర్షికన. ఆ పిచ్చుక పేరే కవిత్వం. ఇంత అద్భుతమయిన కవిత్వం రాసినా దేవిప్రియ ప్రజల గుండెల్లో కొలువయంది మాత్రం రన్నింగ్ కామెంటరీ కవిగానే. రన్నింగ్ కామెంటరీ మూలాలు స్వతంత్ర సందేశ్లో రాసిన 'గాంధీ మార్గం'లో వున్నాయి. ''బడ్జెటంటే ఎందుకోయి బడుగువాడికంత భయం ఇంకా బతికి వున్నందుకు పన్ను లేదు గురూ.. నయం'' అని రాసినప్పుడు విషాదం, వ్యంగ్యం రెండూ జమిలిగా కనిపించి పాఠకుడిని హాస్యరూప జ్ఞానాన్ని కలగజేస్తాయి. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం గురించి సర్కస్ చూస్తున్నప్పుడు కనిపించిందోయ నాకు మన భారత సర్కస్లో డెమోక్రసీ ముసలి పులిగ అంటాడు. సున్నితత్వం, విప్లవ భావుకత్వం, లోతైన విశ్లేషణ, దేవిప్రియ కవిత్వ లక్షణాలు అయితే వ్యంగ్యం, అధిక్షేపం, ధ్వని రన్నింగ్ కామెంటరీ లక్షణాలు సినిమా రచయితగా దేవిప్రియది వినూత్నమయిన ప్రయాణం. అనిశెట్టి సాంగత్యంతో మద్రాసు అటు నుండి హైదరాబాద్. హైదరాబాద్ ఫిలిమ్ క్లబ్లో చూసిన సినిమాలు, అందునా యూరోపియన్ సినిమాలు సినిమా పట్ల దేవిప్రియ దృక్పథాన్ని మార్చేశాయి. సినిమా పేరుతో మనం చూస్తున్నది అంతా సెల్యులారుడ్ పైన డ్రామా అనే ఎరుక కలిగింది. మన సినిమాలలో సినిమాకి వుండవలసిన భాష, వ్యాకరణం, తనదంటూ ఒక శిల్పాన్ని డిమాండ్ చేసే తత్వం లోపిస్తు న్నాయని అర్థమయింది. ప్రజాతంత్రలో ''దేవీదాసు'' పేరుతో సినిమా గురించి రాస్తు న్నప్పుడే బి. నరసింహా రావుతో పరిచయం అయింది. అలా ''మా భూమి'' సినిమాకు అసోసియేట్ అయ్యారు. 'రంగుల కల'కి 'దాసి'కి స్క్రిప్టు రాశారు. రంగుల కలలో గద్దర్ పాడిన 'జమ్ జమ్మావ్ మర' అనే పాటను దేవిప్రియే రాశారు. రంగుల కల సినిమాలో తెలుగులో మొదటిసారిగా వచన కవిత్వాన్ని ప్రవేశపెట్టారు. ఒక పెద్ద, విశాలమయిన పచ్చగడ్డి మైదానంలో ఒక మూల నుండి ప్రవేశించిన నరసింగరావు, రూప మరో వైపు నుండి EXIT అవుతారు. ఈ నడుమ నడుస్తూ వెళుతున్నపుడు ''పచ్చగడ్డి మైదానంలా మన ముందు పరుచుకుంది జీవితం రా! ప్రియా.. రా!'' ఇలా మొదలవుతుంది ఆ కవిత. ఆ తరువాత ఈ ప్రయోగాన్ని ఎవరూ కొనసాగించలేదు. రగులుతున్న భారతం సినిమాలో కూడా ఒక మంచి డ్యూయెట్ రాశారు కానీ... దానికి ఎందుకో రావలసినంత పేరు రాలేదు. నెదర్లాండ్స్ ప్రభుత్వానికి ఒక గ్రౌండ్ వాటర్ ఫిలిమ్ చేశారు. గద్దర్ మీద THE MUSIC OF A BATTLESHIP అనే డాక్యుమెంటరీ తీశారు. ఇవన్నీ సినిమా రంగంలో దేవీప్రియ విజయాలు. ఏ రంగంలో వున్నా, ఏక కాలంలో అనేక రంగాలలో వున్న ప్రతి దానినీ నిబద్ధతతో ఎక్సెవ్ చేయడానికి ప్రయత్నించారు దేవీప్రియ. జలపాతాల ధారలు పట్టుకుని ఊగుతూ, దూకుతూ అరణ్యాలు దాటిన వాడు, బతుకు చిరుత పులి మీసాలు పట్టుకుని ఒక చేత, ఒక చేత పుస్తకం పట్టి ముళ్లకంపల్లో పల్టీలు కొట్టినవాడు. తన సహచరి వెళ్లిపోయిన తరువాత ఒంటరితనానికి అపరిమితంగా భయపడ్డాడు. ఆ ఏకాంత శూన్యాన్ని పదే పదే పలవరించాడు. సాయిబాబా గురించి రాసినా, ఎక్కడో అరణ్యాలలో ఉండి ఒంటరిగా, మంచులో తడిసిన తుపాకి మడమలని నిమురుకుంటూ దాన్ని కావలించుకుని పడుకున కామ్రేడ్స్ గురించి రాసినా అక్కడ కూడా I Relate my lovelyness అన్నాడు అకాశవాణికి యిచ్చిన యింటర్వ్యూలో.. అరణ్య పురాణంలోని ఒక మాట రాశాడు దేవీప్రియ రమ్మని కబురువచ్చాక రాయంచవైనా రయ్యిన ఎగిరిపోవలసిందే... హంసల దీవికి అవును హంసల దీవికి రాయంచలా దేవీప్రియ ఎగిరిపోయాడు. చేప చిలుక మూగబోయింది. తుఫాను తుమ్మెద ఝుంకారం ఆగిపోయింది. అరణ్య పురాణం యింకా పూర్తికాలేదు... కానీ నీటి పుట్ట పగిలిపోయింది. దేవీప్రియకు నివాళిగా ఏమి యివ్వగలం? ఒకప్పుడు శివారెడ్డి గురించి తాను రాసిన కవితనే కాస్త మార్చి ''దేవీప్రియ లాంటి కవిని ఇచ్చిందోరు గుంటూరు తెలుగునాట ప్రతి తల్లీ ఇలాంటోన్ని కంటే చాలు'' - అంటాను.