Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలోని 13 మండలాలకు 137 క్లస్టర్లు ఎంపిక
అ ప్రభుత్వ నిర్ణయంతో తొలగనున్న ఇబ్బందులు గ్రామ పంచాయతీ సేవలు ఇక ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రతి పనికి మండల కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా గ్రామీణ ప్రజలందరికీ ఈ సేవలు అందనున్నాయి. ఇందులో భాగంగా పంచాయతీ అధికారులు క్లస్టర్లుగా విభజించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ధేశించుకున్నారు.
నవతెలంగాణ-నిర్మల్ రూరల్
ప్రభుత్వం పంచాయతీ సేవలను ఆన్లైన్లో తీసుకురానుండడంతో ప్రజలకు మెరుగైన సేవలందే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలోని 19 మండలాల్లో మొత్తం 240 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిని 137 క్లస్టర్లుగా విభజించారు. వీటిలో ఆన్లైన్ సేవలను అందించేందుకు ప్రభుత్వం క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయం ద్వారా తీసుకోవాల్సి వచ్చేది. దానికి సమయం, డబ్బు వృథా చేసుకుని పనులు వదులుకుని కార్యాలయం చుట్టూ తిరిగితే కానీ వీటిని పొందే వీలుండేది కాదు. ఈ విషయంపైన ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభించాలని ఉద్ధేశంతో ఆన్లైన్ వైపునకు అడుగులు వేస్తోంది. ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేయబోతోంది. దీంతో ప్రజల అవసరాల మేరకు ధ్రువీకరణ పత్రాలు పొందే వీలు లభించనుంది. ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లింపు వంటి సేవలను పంచాయతీల్లోనే పొందవచ్చు. ఆన్లైన్ సేవలపైన పంచాయతీ కార్యదర్శులకు కూడా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఇందుకు గానూ కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాలను కూడా పూర్తి చేసేదిశగా జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు చేశారు. త్వరలో గ్రామీణ ప్రజలందరికీ మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు క్లస్టర్లు ఏర్పాటుచేసి వాటి ద్వారా సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది త్వరగా జరిగితే ప్రజలకు ఇబ్బందులు తీరనున్నాయి.
కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం అవసరం
ప్రభుత్వం నిర్ణయం మంచిదే అయిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు 2, 3 గ్రామాల పంచాయతీ కార్యాలయాలకు విధులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల అదనంగా 2 గ్రామ పంచాయతీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇటీవలే పంచాయతీ అధికారులు కంప్యూటర్ల ఆపరేటర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. అప్పుడే ప్రభుత్వం లక్ష్యం మేరకు ఆన్లైన్ సేవలు గ్రామీణ ప్రజలందరికీ అందించవచ్చు.
త్వరలోనే అందుబాటులోకి ఆన్లైన్ సేవలు: గంగాధర్, జిల్లా పంచాయతీ అధికారి
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు గ్రామ పంచాయతీ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి త్వరలో తీసుకురానున్నాం. పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించాం. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ల నియామకాల నోటిఫికేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలంతో వారం, పదిరోజుల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నాం. గ్రామీణ ప్రజలందరికీ సేవలు అందించేందుకు కసరత్తు పూర్తిచేశాం.