Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాంసి,
ప్రతి గ్రామంలో రజక సంఘాల కమిటీలు వేయాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు అన్నారు. బుధవారం మండలంలోని సవారి బంగ్లా ఆవరణలో తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన రజకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రజకులు పూర్తిగా వెనకబడి ఉన్నారని, ఇప్పటి చాలా మంది ఎంతో దీన పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో రజక సంఘ కమిటీలను వేసుకొని ఐక్యంగా ఉండాలన్నారు. మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులతోపాటు ఇతర కులాలను ఆదుకోవడానికి పని ముట్ల కోసం రూ.250 కోట్లు కేటాయించిందన్నారు. ఆ రుణాలు పొందాలంటే ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఒక్కొక్కరికి రూ.లక్షా చొప్పున సబ్సిడీ రుణాలు వస్తాయన్నారు. అవి పూర్తి స్థాయిలో పొందాలంటే కమిటీలు తప్పనిసరిగా ఉండాలన్నారు. నిరుపేద రజకులను గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం భీంపూర్ మండల కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు లస్మన్న, నారాయణ, నర్సయ్య, భూమన్న, వెంకటరమణ, అశోక్, మండలాధ్యక్షులు జానకొండ ఆశన్న పాల్గొన్నారు.