Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘం మండలాధ్యక్షులు దుర్గం పోశలింగం
నవతెలంగాణ-దస్తురాబాద్
జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 3న నిర్వహించే టీ-మాస్ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండలాధ్యక్షులు దుర్గం పోశలింగం అన్నారు. మండల కేంద్రంలో టీ-మాస్ ఫోరం సభ పోస్టర్ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైతే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశ పడి రాష్ట్రాన్ని సాధించుకుంటే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో కులదురహంకార హత్యలు, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణలో 5 నెలల పాటు మహాజన పాదయాత్ర నిర్వహించారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, సామాజిక న్యాయంపై టీ-మాస్ ఆవిర్భవించిందని అన్నారు. వచ్చేనెల 3న నిర్మల్లో నిర్వహించే సభలో బడుగు, బలహీనవర్గాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి టీ-మాస్ సిట్టింగ్ కమిటీ సభ్యులు, ప్రజా గాయకుడు గద్దర్, ఫోరం కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, విమలక్క, జెవి.రావు, సత్యనారాయణ, సిద్ది రాములు, జాన్వెస్లీ, అద్దంకి దయాకర్, సాయిబాబు, ఎండి.అబ్బాస్ హాజరవుతున్నారన్నారు. సభ విజయవంతం కోసం కుల సంఘాలు, ప్రజా సంఘాలు, నాయకులు, దళిత నాయకులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్, అంబేద్కర్ సంఘం మండల కార్యదర్శి శైలేందర్, కేవీపీఎస్ జిల్లా నాయకులు పసుల రాజలింగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డాకూరి తిరుపతి, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాస్, విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు రాజేశ్వర్, పోతు శ్రీను, దుర్గం రాజేందర్ పాల్గొన్నారు.
ఖానాపూర్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ 3న నిర్వహిస్తున్న టీ-మాస్ ఫోరం ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. పట్టణంలోని విశ్రాంతి భవన్లో బుధవారం పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధన కోసం తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కమిటీ నిర్వహిస్తున్న టీ-మాస్ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమానికి టీ-మాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు, ప్రజా గాయకుడు గద్దర్, ఫోరం కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, విమలక్క, జెవి.రావు, సత్యనారాయణ, సిద్ది రాములు, జాన్వెస్లీ, అద్దంకి దయాకర్, సాయిబాబా, ఎండి.అబ్బాస్ హాజ రవుతున్నా రన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డాకూరి తిరుపతి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కాసుల రాజలింగం పాల్గొన్నారు.