Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
- ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక నిధి
- అత్యవసర పరిస్థితుల్లో చేయూత
రైతును రారాజును చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. గ్రామాలవారీగా రైతు కమిటీలను ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపడుతోంది. ఈ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఆచరణలో సాధ్యమవుతుందా.. లేదా అన్నది అనుమానంగా మారింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరీ ఈ రైతు సంఘాలు ఎంతమేరకు ఫలితాలు సాధిస్తాయో చూడాలి. దీనిపై నవతెలంగాణ ప్రత్యేక కథనం...
నవతెలంగాణ- ఆదిలాబాద్ అర్బన్
రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లాస్థాయి వరకు రైతు సంఘాల ఏర్పాటు, అందులో రైతుల భాగస్వామ్యం, మహిళా రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఉత్వర్వులతో అటు రైతాంగం, ఇటు యంత్రాంగంలో హడావిడి నెలకొంది. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు సమితుల కసరత్తు పూర్తి చేయాలనే ఆదేశాలతో అధికారులు ఆ పనిలో నిమగమయ్యారు.
సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు...
జిల్లాలోని 243 రెవెన్యూ గ్రామపంచాయతీల పరిధిలో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో గ్రామంలోని ప్రతిరైతూ సభ్యుడిగా ఉంటారు. వీరి నుంచి ప్రతి సామాజికి వర్గానికి ప్రాధాన్య తనిస్తూ 15 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో మూడోవంతు ప్రాతినిధ్యం మహిళల (ఐదుగురు)కు కేటాయిస్తారు. ఇలా ప్రతి గ్రామం నుంచి 15 మంది చొప్పున ఎన్నుకున్న కమిటీల ద్వారా మండలస్థాయిలో 24 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. మండల కమిటీల ద్వారా జిల్లాస్థాయిలో 24 మందితో రైతు సమన్వయ సమితి ఏర్పాటవుతుంది. మండల, జిల్లాస్థాయి సమితుల్లో 8 మంది చొప్పున మహిళలకు చోటు కల్పిస్తారు. ఆపై రాష్ట్రస్థాయిలో 42 మందితో సమితిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ వచ్చే నెల వరకూ పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రైతు అవసరాలకు నిధి
వ్యవసాయం సాఫీగా సాగేందుకు రేఐతుల అవసరాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం దీనికి బడ్జెట్ నుంచి రూ.500 కోట్లు కేటాయించనుంది. పంట రైతుల చేతికొచ్చే సమయానికి తక్కువ ధర పలకడం, తర్వాత ధర పెరిగిన సందర్భాలు పలుమార్లు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ గోదాముల్లో పంటలను నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ నిల్వల ఆధారంగా నిధి నుంచి రైతులకు ఏడాదిపాటు వడ్డీలేని రుణం అందజేస్తారు. దీంతో పంటలకు రేటు వచ్చిన తర్వాత వాటిని అమ్మి నిధి నుంచి పొందిన రుణం చెల్లించాల్సి ఉంటుంది. అదును ప్రకారం ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయడం, పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం, పంటలను అడ్డికి పావుసేరు అమ్మడం వంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడనుంది.
సమితులతో మంచి ఫలితాలు: జిల్లా వ్యవసాయ అధికారి
ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే రైతు సమన్వయ కమిటీలు మంచి ఫలితాలు వస్తాయి. రైతులను ఒక్కతాటిపైకి తెచ్చి వారి నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ నిధి ద్వారా రైతుల అవసరాలు తీరుతాయి. ప్రభుత్వ పథకాలు, సలహాలు, సూచనలు సక్రమంగా రైతులకు అందుతాయి. అధికారులకు రైతులకు మధ్య అనుసంధానంగా వ్యవసాయశాఖ పనిచేస్తుంది.
ఇవీ ఉపయోగాలు, ప్రయోజనాలు
-రైతుల అభిప్రాయాలు, సూచనల మేరకు మద్దతు ధర ఉండేలా రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించనున్నాయి.
-పంట ఖర్చు, పెట్టుబడి, రైతు కష్టం మొదలైనవన్నీ లెక్కించి పంటకు మద్దతు ధర ఎంత నిర్ణయించాలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులు నిర్ణయిస్తాయి.
-భూ నమునాలు, వాటి ఫలితాల ఆధారంగా ఏ పంటను వేయాలి. ఎప్పుడు సాగు చేయాలి. చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ పద్ధతుల వంటి వాటిపై వ్యవసాయ అధికారులు, నిపుణుల సలహాలు, సూచనలు అందుతాయి.
-వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే పంటల పెట్టుబడి రాయితీ పంపిణీ నిజమైన రైతులకే అందేలా చూడాల్సిన బాధ్యత ఈ సమితులదే.
-పంట రుణం, సబ్సిడీ వంటివి ఎలా అందుతున్నాయో సమితి పర్యవేక్షిస్తుంది.