Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తలమడుగు
సీపీఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న చేపడుతున్న సామూహిక సెలవు కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల రత్నాకర్రెడ్డి కోరారు. బుధవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ 1ననుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఆరోజు నుంచి సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా పీఆర్టీయూ నిరసనలు, ఢిల్లీలో మహాధర్నా చేపట్టిందన్నారు. సెప్టెంబర్ 1న జరిగే సామూహిక సెలవుకు పీఆర్టీయూ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కొంత కాలంగా ఆందోళనలు చేపట్టినట్టు తెలిపారు. ఈ విధానం వలన ఉపాధ్యాయులు గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం కోల్పోయి, రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సీపీఎస్ విధానం రద్దు చేసేంత వరకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో రానున్న కాలంలో పికెటింగ్లు, ధర్నాలు చేస్తామన్నారు. సెప్టెంబర్ ఒకటిన జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు మండల విద్యాధికారి కార్యాలయంలో నిరసనలు తెలియజేసి, నల్లబ్యాడ్జీలు ధరించాలన్నారు. సామూహిక సెలవు పెట్టిన ఉపాధ్యాయులు జిల్లాలో జరిగే నిరసనకు హాజరు కావాలని కోరారు. సమావేశంలో మండలాధ్యక్షులు మహేందర్, జగదీశ్, శ్రీనివాస్, దిలీప్రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.