Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆదిలాబాద్రూరల్
తెలంగాణ మాండలిక భాష, యాస పరిరక్షణకు కవులు, రచయితలు, అన్ని వర్గాలు నడుం బిగించాలని ప్రముఖ కవి వడ్లూరి ఆంజనేయరాజు అన్నారు. రచయిత మడిపల్లి భద్రయ్య రాసిన 'మనభాష - మనయాస పుస్తకాన్ని ఆదివారం మావలలోని విద్యార్థి కళాశాలలో ఆంజనేయరాజు ఆవిష్కరించారు. అంతుకు ముందు సరస్వతీదేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ వయస్సులో మడిపల్లి భద్రయ్య రాసిన నిఘంటువు విద్యార్థులు, ఉపాధ్యాయులకు, అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆంగ్లేయులే భాష విభజన చేశారన్నారు. భద్రయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాండలిక పదాలను ఉదాహరణగా వివరించడం బాగుందన్నారు. అనంతరం ఆదిలాబాద్ ఆకాశవాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి సుమనస్పతిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ యాస, భాషకు సంబంధించి ఆకాశవాణి ద్వారా పలు కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నామని తెలిపారు. భాషనే అన్నింటికి ఆధారమన్నారు. ఒక ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను యాస అనేది సూచిస్తుందని అన్నారు. కవి డాక్టర్ ఉదారి నారాయణ మాట్లాడుతూ ఈ నిఘంటువును పాఠశాలల్లో, కార్యాలయాల్లో, గ్రంథాలయాల్లో ఉంచాల్సిన అవసరముందన్నారు.నిఘంటువు రచనకు రచయిత చాలా సమయం వెచ్చించారని, సాహితీ అభిమానులు, రచయితలు నిఘంటువును కొనుగోలు చేస్తే చేయూతనిచ్చిన్నట్టు అవుతుందని చెప్పారు. అనంతరం కవులు, రచయితలను విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, బీనాదేవి సన్మానించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు బి.మురళీధర్, పద్యకవి పెండ్యాల కిషన్శర్మ, కవి, విమర్శకులు తెలుగు ఉపన్యాసకులు ఎంవీ పట్వర్ధన్, దేవేందర్, లింగన్న, బాబన్న, రాజవర్ధన్, నారాయణ పాల్గొన్నారు.