Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాగజ్నగర్
కుమురంభీం - ఆసిఫాబాద్ జిల్లాలో పాత మండలాలు 12 ఉండగా కొత్తగా మూడు మండలాలు ఏర్పడ్డాయి. అయితే పాత 12 మండలాలలకు గాను ఇందులో కేవలం మూడు మండలాల్లోనే బస్టాండ్లు ఉన్నాయి. పాత తొమ్మిది మండలాలతో పాటు కొత్తగా ఏర్పడ్డ మూడు మండలాల్లో బస్టాండ్లను నిర్మించాల్సి ఉంది. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్తోపాటు కాగజ్నగర్, కౌటాల మండలకేంద్రాల్లో మాత్రమే బస్టాండ్లు ఉన్నాయి. మిగిలిన మండలాలతోపాటు ప్రధాన గ్రామాల్లో ఎక్కడా బస్టాండ్లు, బస్షెల్టర్లులేవు. దీంతో ప్రయాణీకులు రోడ్డు పక్కన ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సిర్పూర్(టి) నియోజకవర్గంలో..
సిర్పూరు (టి) నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా, కేవలం కాగజ్నగర్, కౌటాల మండల కేంద్రాల్లో మాత్రమే బస్టాండ్లు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన సిర్పూరు (టి)లో బస్టాండ్ నిర్మాణానికి స్థలం కేటాయించి గతంలోనే శిలాఫలకాన్ని ఏర్పాటుచేశారు. స్థల వివాదం కారణంగా ఇది ఆగిపోయింది. ప్రస్తుతం ఆ స్థలంలో ఒక షెడ్డు ఏర్పాటు చేశారు. కానీ ప్రధాన రహదారి నుంచి లోపలికి ఉండడం, అక్కడికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సులు ఆ షెడ్డు వద్దకు వెళ్లడం లేదు. ప్రధాన రహదారిపైనే బస్సులు ఆగుతుండడంతో ప్రయాణికులు రోడ్డు పక్కన హోటళ్లు, దుకాణ సముదాయాల వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. బెజ్జూరు మండలకేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కలగానే మారింది. ఇక్కడ బస్టాండ్నిర్మాణానికి 2006లో రూ. 3 లక్షలు మంజూరైనా ఆ నిధులతో బస్టాండ్ నిర్మాణం పూర్తి కాదనే కారణంగా పనులు చేపట్టలేదు. దీంతో నిధులు వెనక్కిపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం లేదు. ఈ మండలంలో కూడా ప్రయాణికులు దుకాణ సముదాయాలు, హోటళ్ల వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. దహెగాం మండలంలో పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. ఈ మండలకేంద్రానికి నిత్యం వేల సంఖ్యలో వివిధ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ బస్టాండ్ లేకపోవడంతో వారంతా రోడ్డుపైనే నిరీక్షించాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రతీ మంగళవారం ఇక్కడ వారాంతపు సంతను నిర్వహిస్తుంటారు. ఇదే స్థలంలో ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం వేచి చూస్తుంటారు. దీంతో విపరీతంగా రద్దీ ఉంటోంది. వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక కొత్త మండలాలైన పెంచికల్పేట్, చింతలమానెపెల్లిలో కూడా బస్టాండ్లు లేవు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో..
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉండగా, కేవలం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లో మాత్రమే బస్టాండ్ ఉంది. మిగిలిన ఏడు మండలాలలో బస్టాండ్లు లేవు. వాంకిడి మండలకేంద్రంలో గ్రామసరిహద్దులో బస్టాండ్ పేరుతో షెడ్డు నిర్మించినా అది నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం మండలకేంద్రంలోని ప్రధాన రహదారిపైనే బస్సులు ఆగుతుండడంతో ప్రయాణీకులు హైదరాబాద్ - చంద్రాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపైనే బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. జైనూర్, కెరమెరి, సిర్పూరు (యు) మండలకేంద్రాల్లో నేటికీ బస్టాండ్లు లేవు. ఆసిఫాబాద్ - ఆదిలాబాద్ ప్రధానరహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఈ మండలాల్లో బస్టాండ్లు లేకపోవవడంతో రోడ్లపైనే ప్రయాణీకులు బస్సుల కోసం నిరీక్షిస్తుంటారు. ముఖ్యంగా ఈ మండలాల్లో మూత్రశాలలు లేకపోవడం ప్రయాణికులను తీవ్ర అవస్థలకు గురి చేస్తోంది. ప్రధాన రహదారి గుండా వాణిజ్య సముదాయాలు ఉండి నిత్యం రద్దీగా ఉండడం, మూత్రశాలలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రెబ్బెన మండలకేంద్రంలో బస్ షెల్టర్ ఉన్నా అది నిరుపయోగమే. బస్టాండ్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినా ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి మంజూరై ఉండడంతో బస్టాండ్ నిర్మాణం చేపట్టడం లేదు. నాలుగు వరుసల రహదారి నిర్మాణం తర్వాత బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసిఫాబాద్ - మంచిర్యాల ప్రధాన రహదారిపైనే ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. తిర్యాణిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పడ్డ లింగాపూర్లో కూడా బస్టాండ్ లేదు. ఉన్నతాధికారులు స్పందించి అన్ని మండలాల్లో బస్టాండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.