Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుండి మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి
- పదిరోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం
- వార్డుకో ప్రత్యేకాధికారి
- పచ్చదనం పరిశుభ్రతలే ప్రాధాన్యతాంశాలు
- పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయా?
- ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు
నవతెలంగాణ - హాజీపూర్, మందమర్రి రూరల్
పల్లెప్రగతి పేరుతో గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిటస పారిశుధ్య, ఇతర సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల పాడుబడ్డ బావులను పూల్చడం, శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించడం చేశారు. అయితే నిధులు సరిపడా లేక పూర్తిస్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతం కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవయ్యాయి. పల్లెప్రగతి స్ఫూర్తితో మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరుతో పది రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికోసం మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడమే కాకుండా ప్రత్యేకాధికారుల నియామకం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో అవగాహనా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రోడ్లపై చెత్త చెదారం, మురుగునీటితో నిండిన డ్రయినేజీలు, వీధుల్లో పందుల స్వైరవిహారం, వేసవిలో తాగునీటి ఇక్కట్లు ఇలా పలు సమస్యలతో సతమవుతున్న నేపథ్యంలో ఈ పట్టణప్రగతితోనైనా సమస్యలు తీరాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు
ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్నగర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, క్యాతన్పల్లి, నస్పూర్, లక్షెట్టిపేట్, చెన్నూర్ 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 333 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పదిరోజుల పాటు నిర్వహించనున్నారు. పల్లెప్రగతి మొదటి విడతలో చేపట్టిన విధానంగానే మొదట వార్డుల వారీగా ఉన్నా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తిస్తారు. వార్డుల వారీగా సంఘాలను ఏర్పాటు చేసి, వారిని భాగస్వాములను చేయనున్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించారు పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలను మొదటి దశ పనుల్లో చేపట్టనున్నారు. మున్సిపాలిటీల్లో ఎక్కడైతే శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు లేవో అక్కడ పనులు చేపట్టనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అదనంగా కావాల్సి వస్తే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మురుగు కాలువలు శుభ్రం చేయడం, చెత్తా చెదారం తొలగించడం, వంగిన, ప్రమాదకర విద్యుత్ స్తంభాలను సరిచేయడం, అవసరమైతే కొత్త వాటిని ఏర్పాటు చేయడం లాంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విరివిగా మొక్కలు నాటడం, గుంతలను పూడ్చడం, పాడుబడిన ఇండ్లను తొలగించడం, వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడం లాంటివి చేయనున్నారు
పట్టణ రూపురేఖలు మారుతాయి
పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు. దీనికి ప్రజల భాగస్వామ్యం అవసరం. సోమవారం నుండి పది రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రతివార్డుకు ప్రత్యేకాధికారిని నియమించాం. వార్డుల్లో ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి, వారి భాగస్వామ్యంతో మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను గుర్తించి, వాటిని నిర్మూలించి పట్టణాన్ని సుందరంగా మార్చేందుకు కృషిచేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కార్యక్రమం అనంతరం కూడా పట్టణంలో ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
- కుడికాల బాపు, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్
దశాబ్దాలుగా పెండింగ్లో..
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి.
- ఆదిలాబాద్ పట్టణంలో తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, పంజాబ్చౌక్లో ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ స్థలం లేకపోవడం దశాబ్దాలుగా వేధిస్తున్నాయి.
- మంచిర్యాల పట్టణంలో ఇప్పటి వరకు డంపింగ్ యార్డు నిర్మించాల్సి ఉంది. డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
- మందమర్రిలో ఇప్పటికీ కౌన్సిల్ లేకపోవడం సమస్యగా ఉంది. అంతేకాకుండా పారిశుధ్యం సమస్య తీవ్రంగా ఉంది. వారానికోసారి మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అంతర్గత రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
- కాగజ్నగర్లో దశాబ్దాలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సంజీవయ్య కాలనీలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, సెంట్రల్ లైటింగ్ ఉన్నా పని చేయకపోవడం, రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, ఆహ్లాదం కోసం పార్క్లు లేకపోవడం, కూరగాయల, మాంసం మార్కెట్లు అభివృద్ధిపర్చకపోవడంతో రోడ్లపైనే కూరగాయల అమ్మకాలు, అక్రమ కట్టడాలు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
- ఖానాపూర్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ లేకపోవడం, రోడ్డు వెడల్పు చేపట్టకపోవడం, డ్రయినేజీ వ్యవస్థ సరిగా లేకపోక ఇబ్బందులు తప్పడం లేదు.
- భైంసాలో అంతర్గత రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మురుగుకాలువలు లేక రోడ్లపై నుంచి మురుగునీరు పారుతోంది. శివారుకాలనీలకు ఇప్పటికీ తాగునీరు చేరలేకపోతోంది.