Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల
రాక్షస హస్తాలతో ఢిల్లీకి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనను కేసీఆర్ వ్యతిరేకించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ సందర్భంగా కేసీఆర్కు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ రాకను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ట్రంప్ ఇరాన్, పాలస్తీనా లాంటి దేశాలపై పాశవిక దాడులకు పాల్పడు తున్నాడని, భారతీయుల వాచ్వన్ వీసాలపై షరతులు విధిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలింబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 23 వరకు ఆందోళనలు చేపడతామన్నారు. సీఏఏ, ఎన్నార్సీకి తాము వ్యతిరేకమని చెప్పిన సీఎం కేసీఆర్ చితశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను అమ్ముతూ భవిష్యత్ తరాలకు సేవలందించేందుకు స్థలం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద ఎంఐఎంను వెంట పెట్టుకుని కేసీఆర్ తెలంగాణా ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడుకునే దిశగా ప్రత్యక్ష పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి 30వేల ఎకరాల భూమి కావాలని చెప్పి అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థించి అసెంబ్లీలో ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మాటమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీని వెనుక సీఎం అనుయూలకు, బంధుగణానికి లబ్ది చేకూర్చాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రికి మూడు రాజధానులు చేయాలన్న ఉద్దేశం ఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించి ప్రజా తీర్పును కోరాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులను ప్రతిపాదించిన ముఖ్యమంత్రి ముగ్గురు సీఎంలను నియమిస్తారా? అని ప్రశ్నించారు. రాజధానిపై వేసిన కమిటీలన్ని బోగస్ అన్నారు. కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజ, మాజీ ఎంపీ అజీజ్పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకులు గుండా మల్లేష్, పల్లా వెంకట్రెడ్డి, జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి, యాదగిరిరావు పాల్గొన్నారు.