Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్నగర్
మిల్లులో విద్యుత్ ఉత్పత్తి కోసం యాజమాన్యం నూతన బాయిలర్ నిర్మాణ పనులు చేపడుతోంది. ఈ పనులను ఆసియన్ చైన్నైకు చెందిన సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఈ పనులను చేడుతున్న సంస్థ పని ప్రదేశాల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టిందనే విషయంలో మాత్రం దృష్టి సారించలేదు. బాయిలర్ నిర్మాణం కోసం 20ఫీట్ల లోతు నుండి రాడ్లతో సెంట్రింగ్ పనులు చేస్తున్న కార్మికుల రక్షణను యాజమాన్యం పూర్తిగా విస్మరించింది. కింద భూమి తడిగా ఉండడం, ఆ తడికి పైనున్న భూమి తేమతో వదులుగా మారి ఏ క్షణమైన కూలుతుందనే విషయాన్ని సైట్ ఇంజినీర్లు ముందుగానే ఎందుకు గమనించలేదన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. షిఫ్టులవారీగా ప్రతి షిఫ్టులో 12మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు. కేవలం పనిపైనే దృష్టిపెట్టిన సదరు కాంట్రాక్టు సంస్థ కార్మికుల ప్రాణాలను పరిగణలోకి తీసుకోలేదు. అర్ధరాత్రి 11గంటల సమయంలో మట్టిపెళ్లలు పడి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంజిత్, రఘునాథ్రాం, చోటు భాయియా మృతి చెందారు. మల్లు రాందాస్, సంతోష్రాం, పరికైరాం, రన్ప్రీత్రాం, సజరురాం తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సదరు కాంట్రాక్టు సంస్థనే బాధ్యుల్ని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఎస్పీఎంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. గతేడాది అక్టోబర్లో మిల్లులో పేలుళ్లు జరిగి ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాళ్లు తెగిపోయి దుర్భర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అప్రెంటిస్ కార్మికులు శ్యాంరావు(రెబ్బెన), సాయికృష్ణ(మందమర్రి), కుమార్(రెబ్బెన) తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు ఎలా జరిగాయనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. డాగ్స్క్వాడ్, క్లూస్టీంతోపాటు ఫోరెన్సిక్ నిపుణుల బృందం సైతం మిల్లుకు వచ్చి విచారణ చేపట్టింది. ఈ సంఘటనకు ముందు కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నా యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలూ చేపట్టకపోవడం గమనార్హం.
స్థానికుల కాకపోవడంతోనే నిర్లక్ష్యం
ఈ మిల్లులో తరచుగా జరుగుతున్న ప్రమాదాల్లో ఇప్పటివరకు స్థానికేతరులు మృతి చెందడం, గాయాలపాలవడం జరుగుతూ వస్తోంది. వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడం, వారి సంబంధికులు స్థానికంగా ఉండకపోవడంతో యాజమాన్యంపై ఎలాంటి ఒత్తిడి ఉండడం లేదు. ఈ కారణంగానే ఎస్పీఎం యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ
ఎస్పీఎంలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఆదివారం ఉదయం ఆసిఫాబాద్ ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాద ఘటనపై విచారణ చేపడుతున్నామన్నారు. సంఘటనా స్థలంలో విధులు నిర్వర్తిస్తున్న తోటి కార్మికుడు సురేష్ ఫిర్యాదు మేరకు సీనియర్ ఇంజినీర్ గణేషన్, సూపర్వైజర్ గోపినాథ్తోపాటు మరికొంత మందిపై సెక్షన్ 304(ఎ), 337 ఐపీసీల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
కార్మికులు మృతిచెందడం బాధాకరం:ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ఎస్పీఎం మిల్లులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందడం బాధాకరమని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలిని సందర్శించి యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాయిలర్ పనులు చేపడుతున్న కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. స్వల్పంగా గాయపడ్డ ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
మిల్లు యాజమాన్యమే బాధ్యత వహించాలి: పాల్వాయి హరీశ్బాబు, కాంగ్రెస్ ఇన్చార్జి
ఎస్పీఎంలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకులు పాల్వాయి హరీశ్బాబు డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన తర్వాత కనీసం మీడియాను అనుమతించకపోవడంలో అంతర్థారం ఏమిటని ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి యాజమాన్యం గోప్యతను ప్రదర్శిస్తూ వాస్తవాలను బహిర్గతం కాకుండా కుట్రపన్నుతోందన్నారు. గడిచిన యేడాది కాలంలోనే మిల్లులో 8 ప్రమాదాలు జరిగాయని తెలిపారు. మృతి చెందిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.