బానిస బతుకుల్లోంచి బయట పడాలని మనల్ని మనం ఎన్ని సార్లు చంపుకున్నామో..! మనలో మనం ఎన్ని సార్లు జన్మలెత్తామో..!
త్యాగాలు కొన్ని.. తెగింపులు కొన్ని స్వేచ్ఛా గాలుల కోసం అలుపెరగని పోరాటాలు ఎన్నో ఎన్నెన్నో.. అన్నీటికీ ముక్తాయింపుగా పంద్రాగస్టు పంతొమ్మిది వందల నలబై ఏడు... నేడు కళ్లముందు ఏడు పదుల స్వాతంత్య్రం..! ముసి ముసి నవ్వుల మువ్వన్నెల్ని మూట గట్టుకుని రంగులు మారుతున్న లోకాన్ని చూస్తూ నవ్వుతూనే వుంది మన ఏడు పదుల వసంతం..
చేతుల్లో చిల్లి గవ్వలేని బతుకుల్నీ అన్నమోరామ చంద్రా అనే ఆకళ్లనీ చీకటి గదుల్లో మూలుగుతున్న కరెన్సీ కట్టల్నీ యంత్రాలు బంధిస్తున్న పచ్చనోట్ల లెక్కల్నీ భారు భారు అంటే బంధుత్వాలే కాదు భయాలు అని నేర్పే గుణ పాఠాల్నీ.. మనం నిత్యం నేర్చుకుంటూనే వున్నాం.. భగ భగ మండే ఉగ్రవాద అగ్నిపూలు కుతకుతలాడే కులమతాల జిల్లేళ్లు ప్రాణవాయువులు లేక తిరిగిరాని లోకాలకు చిన్నారులు.... అన్నీ జవాబు లేని దశ్యాలే..!
జీవన తిమిరమై తలకెక్కిన దుష్ట ద క్కుల్ని మన కోసం మనం మరొక్కసారి అవనతం చెద్దాం..! పిప్పరమెట్లూ..చాకిలేట్లే కాదు బాలల బంగరు భవితకు అక్షర రుచుల్ని వడ్డిద్ధాం.. ఆకాశాన ఎగిరే త్రివర్ణ పతాకానికి నిండారా సెల్యూట్ చేద్దాం.. మేరా భారత్ మహాన్ అంటూ.. వెలుగు పూల వసంతాన్ని ఆహ్వానిస్తూ.. మనమంతా భరతమాతకు మానవహారమవుదాం..!