- మెడికల్ షాప్ను సీజ్ చేసిన టాస్క్ఫోర్సు పోలీసులు - పెద్దఎత్తున మందుల స్వాధీనం - వివరాలు వెల్లడించిన డీసీపీ లింబారెడ్డి నవతెలంగాణ - సిటీబ్యూరో వైద్యుల సూచనల మేరకే మందులు విక్రయించాలని డ్రగ్ కంట్రోలర్ అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు మెడికల్ దుకాణదారులు అవేమీ పట్టించుకోకుండా సులువుగా డబ్బులు సంపాదించాలని మందులను విక్రయిస్తున్నారు. ఆసిఫ్నగర్లో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ దుకాణంపై టాస్క్ఫోర్సు అధికారులు, డ్రగ్స్ కంట్రోలర్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. మెడికల్ దుకాణం నిర్వాహకునితోపాటు 34 సిరప్లు, వివిధ కంపెనీలకు చెందిన 1972 మందుగోలీలను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ లింబారెడ్డి వివరాల మేరకు...ఆసిఫ్నగర్కు చెందిన మహ్మద్ సర్ఫరాజ్ (52) స్థానికంగా 'ఎస్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్'ను నడిపిస్తున్నాడు. 1998 నుంచి మెడికల్ షాప్ను నిర్వహిస్తున్న మహ్మద్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే అనస్థిషియా, ఒళ్లు నొప్పుల కోసం ఉపయోగించే వివిధ రకాల గోలీలతోపాటు, (టానిక్లు) సిరప్లను విక్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు డ్రగ్స్ అధికారులతోపాటు దాడులు నిర్వహించారు. నిందితుని అరెస్టు చేశామని, తదుపరి విచారణ నిమిత్తం మెహిదీపట్నం పోలీసులకు అప్పగించినట్టు డీసీపీ తెలిపారు.