- నమోదవుతున్న డెంగ్యూ కేసులు
- మలేరియా విజృంభణ
- ఫీవర్ ఆస్పత్రిలోనే 24 కేసులు
- జిల్లాలో 39 కేసులు నమోదు
- బయటకు రాని ప్రయివేటు ఆస్పత్రుల లెక్కలు
- వర్షాలతో మరిన్నీ పెరిగే అవకాశం
- రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం : డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డి
నవతెలంగాణ - సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్పై దోమలు పంజా విసురుతున్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలో డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నగరంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా గతేడాది చోటుచేసుకున్న మరణాలను తలచుకుంటే నగర ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. వారం, పది రోజుల్లోనే డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో.. వాతరవరణం వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండడంతో నగరంలో డెంగ్యూ, మలేరియా ఇతర విష జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు, మూసీనది వెంట ఉన్న ప్రాంతాలతోపాటు మురికివాడలలో దోమలు అత్యధికంగా ఉన్నాయి. వర్షాకాలం కావడంతో నగరవ్యాప్తంగా దోమలు విపరీతంగా పెరిగాయి. గతేడాది ఈ సీజన్లో నగరవ్యాప్తంగా సుమారు 400లకు పైగా డెంగ్యూ కేసులు నమోదవ్వగా 13మంది వరకు మరణించారు. గతేడాది నమోదైన డెంగ్యూ కేసులు, మలేరియా కేసుల ఆధారంగా నగరంలో 89 ప్రాంతాలను డెంగ్యూ హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించగా, 68 ప్రాంతాలను మలేరియా హైరిస్క్ ప్రాంతాలుగా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. దోమల నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ప్రకటించి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టినా నగరంలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలో జూలైలో 113 మలేరియా కేసులు నమోదయ్యాయని, 24 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య శాఖాధికారులు వెల్లడించారు. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు 39 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, వారం, పది రోజుల్లో మరిన్నీ పెరిగే అవకాశాలు న్నాయని చెబుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగ్యూ, మలే రియా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఈ సమాచారాన్ని ప్రయివేటు ఆస్ప త్రులు జిల్లా వైద్య శాఖకు అందించకపోవడం విశేషం.
డెంగ్యూ కేసులు
ఎడిస్ అనే దోమ వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధి తీవ్ర జ్వరంతో రోగిని అనారోగ్యానికి గురిచేస్తుంది. కేవలం పరిశుభ్రమైన నీటిలో పెరిగే ఈ దోమ జీవిత కాలం 21 రోజులే అయినా ఈ కాలంలో పది వేల దోమలను ఉత్పత్తి చేస్తుంది. ఇంటి పరిసరాలు, అలంకరణ కోసం పెంచుకునే మొక్కలే ఈ దోమ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో నగర శివారు ప్రాంతాలు, మురికివాడలే గాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లోనూ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. వారం, పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరమంతా అపరిశుభ్రంగా తయారైంది. ఫలితంగా దోమలు వ్యాప్తి చెంది పలు రకాల విష జ్వరాలకు ప్రజలు లోనవుతున్నారు. దీంతో గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు పలు ప్రయివేటు ఆస్పత్రులలో విష జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. నగరంలోని నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చిన రోగులలో పలువురికి డెంగ్యూ లక్షణాలతో వచ్చిన రోగులకు పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటీవ్గా తేలింది. ఈ నెలలో ఇప్పటి వరకు 24 డెంగ్యూ కేసులు ఫీవర్ ఆస్పత్రిలోనే నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రిలో డెంగ్యూ పాజిటివ్గా తేలిన రోగులకు చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా నయమైన వారిని డిశ్చార్జీ చేస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులు సైతం ఇదే అదునుగా భావించి తీవ్ర జ్వరంతో వచ్చిన రోగులకు డెంగ్యూ వచ్చిందని, తెల్లరక్తకణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రోగుల ముక్కుపిండి వసూళ్లకు దిగుతున్నాయి. అయితే డెంగ్యూ వచ్చిన రోగులకు ప్లేట్లెట్లు (తెల్లరక్త కణాలు) పడిపోవడంతో ఇతరుల నుంచి వాటిని సేకరించేందుకు బంధువులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రభుత్వం వైపు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని పలువురు భావిస్తున్నారు.
రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డి
విష జ్వరాలు వస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. డెంగ్యూ లక్షణాలుంటే సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గాంధీ, నిలోఫర్, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో డెంగ్యూ, స్వైన్ప్లూ కేసులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. నిలోఫర్లో చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. డెంగ్యూతో ప్రధానంగా ప్లేట్లేట్ల సమస్య ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్లను ఏర్పాటు చేసి సరికొత్త పరికరాల ద్వారా అత్యవసరమైన సమయంలో ఉత్పత్తి చేసే విధంగా పటిష్టం చేశాం.
Authorization