దాశరథి పురస్కార గ్రహీత 'బీఎస్ రాములు' కథలు- ఒక సందర్భం
ఒక నిరుపేద బీసీ కుటుంబంలో పుట్టి బీసీ కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగిన బీఎస్ రాములు గారు చేసిన సాహిత్య, సమాజసేవ వెలకట్టలేనిది. ఆయన మార్గమే ఒక పోరాటం, ఆయన ధ్యేయం సమసమాజ నిర్మాణం. తన డెబ్భై ఏళ్ల జీవితంలో యాభైఏండ్ల సమాజంతోనే మమేకమై ప్రయాణం కొన సాగిస్తున్నారు. సాహిత్యం తోను నిత్య అనుబంధాన్ని కలిగివున్నారు. ఒక బీసీగా పుట్టిన వీరు ఒడి దుడుకులను ఎదుర్కొని జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. వీరి పిల్లలు కాలం ఇచ్చిన అవకశాలను అందిపుచ్చుకొని విదేశాల్లో స్థిరపడి ఉన్నతస్థాయి జీవితం గడుపుతున్నారు. కుటుంబం విజయపథంలో నడవాలంటే ఇల్లాలి పాత్ర కూడా ముఖ్యమైనది. బీఎస్ రాములు గారి సతీమణి శ్యామ లమ్మ కూడా సంసారాన్ని ముందుకు నడిపించగల సమర్థురాలు. భర్త అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎంతో ఆత్మస్థైర్యంతో కుటుంబాన్ని నడపగలిగింది. ఇట్లా వారి కుటుంబం పదిమందికి ఆదర్శంగా, కన్నుల విందుగా విజయ దరహాసాన్ని ఎగురవేస్తుంది.
కాలంలో కలిసి నడిచిన బీఎస్ఆర్...
కథకుడిగా,నవలాకారుడిగా , సాహితీవేత్తగా సమాజతత్వవేత్తగా వందకుపైగా పుస్తకాలు రాశారు. వీరి సాహిత్య, సమాజసేవకు ఎన్నో అవార్డులు వచ్చి తలుపుతట్టాయి. అయితే ఇటీవల దాశరథి రంగాచార్య స్మారక బహుమానం బీఎస్ రాములు గారికి ఇవ్వడం ఎంతో సముచితం. దాశరథి రంగాచార్య తెలంగాణ భాషా జీవనాడిని పట్టుకొని రచనలు చేశారు. బీఎస్ రాములు కూడా తెలం గాణ సమాజాన్ని, సమస్యలను అవపోసన పట్టారు. అంతేకాకుండా దాశరథి రంగాచార్య ఉద్యమ స్ఫూర్తిని, నవలా, కథారచన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. బీఎస్ కథకుడిగా పరిచయం చేయడం ఒక ప్రత్యేకమైన అంశం. అణా గంథమాలను ఒకప్పుడు వట్టికోట ఆళ్వారుస్వామి తన భుజాలమీద వేసుకొని నడిపించినట్టుగా, బీఎస్ రాములూ కథాప్రక్రియను తెలంగాణలో తన తలమీద మోసుకొని వెళ్లి ఊరూర, వాడవాడ తిరిగి బాధ్యతగా కొత్తతరాన్ని ప్రభావితం చేస్తున్నారు. శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. కథా సంకలనాలను ప్రచురిస్తున్నారు. విశాల సాహిత్య అకా డమీని స్థాపించి కొత్త రచయితకు బహు మానాలను అందజేస్తున్నారు. 'కథలబడి' పేరుతో గ్రంథాలను వెలువరించి కథలు ఎలా రాయాలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ కథారచయితగా ముందువరుసలో స్థానం సంపాదించు కున్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండువందల కథలను రాసి కాలంతో పాటు కలిసి నడిచారు. విప్లవ పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలు, ప్రపంచీకరణ, తెలంగాణ ఉద్యమం, దళిత, బహుజన, స్త్రీవాద కోణాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు ఇలా వారి కథా వస్తువులు విస్తృతమైన వేదికపై నడుస్తుంటాయి.
'జగిత్యాల కథ'తో మొదలైన ప్రస్థానం...
బీఎస్ రాములు మొదటి కథ 1968లో బాలమిత్రలో 'జగిత్యాలకథ' అచ్చయింది. ఆ తర్వాత వివిధ సందర్భాలలో, వివిధ పత్రికల్లో కథలు రాస్తూవచ్చారు. 'అడవిలో వెన్నెల'కథ 1984లో అరుణతార పత్రికలో అచ్చయింది. విరసం సభ్యుడి, రాడికల్ యువజనం సంఘం ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా తిరగటం వల్ల, అజ్ఞాతంగా అడవులతో అనుబంధం కొనసాగడం వల్ల రచయిత జీవన పార్శ్వంలోంచే ఈ కథ చిత్రించబడిందని చెప్పవచ్చు. గిరిజన జీవితాలను దగ్గరినుంచి చూడటం ద్వారా కథావస్తువు ఎన్నిక జరిగి ఉండవచ్చు. ఆనాడు తను నమ్ముకున్న సిద్ధాంతం కథలో ప్రతిఫలించిందని చెప్పవచ్చు. ఒక సంపూర్ణమైన కోయజీవితాన్ని చిత్రించిన కథ 'అడవిలో వెన్నెల'. కథా ప్రారంభంలోనే ఇస్రూ పాత్ర గిరిజన జీవితంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తుంది. అడవిబిడ్డలు తమ జీవితాలను తాము నిర్దేశించుకోలేకపోతారు. క్రూరమృగాలు, జంగ్లత్ అధికారులు, పోలీసులు, దోపిడీదారులు, ప్రకృతి వైపరిత్యాలు ఇలా ఎన్నో విషయాలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే గిరిజన జీవి తాల్లో నక్సలైట్ల రాక కథను మలుపు తిప్పుతుంది. ఆనాడు ఆదిలాబాదు, కరీంనగర్,జగిత్యాల, మెదక్ జిల్లాలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. 'అడవిలో వెన్నెల కథ' ప్రస్తుతం దూర విద్యాకేంద్రం , ఉస్మానియాలో ఎంఏ సిలబస్లో ఉంది. 1991లో 'పాలు' కథా సంపుటి వెలువడింది. ఇందులో మూడు కథలున్నాయి. పాలు కథ ఆంధ్రవిశ్వ విద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉన్నది. పాలు కథ వ్యవస్థలో ఉన్న లోపాలను సామ్యవాద దృక్ఫథంతో ఎత్తిచూపించింది. కథలో ఎల్లవ్వ ఆ ఊరి పంతులు ఇంట్లో పని చేస్తుంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త దూరదేశానికి వలసపోతాడు. కష్టాన్ని నమ్ముకుని బతుకును కొనసాగిస్తుంటుంది ఎల్లవ్వ. రోజంతా ఇంటిపని చేయడం, బర్రెలకు మేత వేయడం, కొట్టం శుభ్రం చేయడం, పాలు పిండటం ఇట్లా అన్ని పనులూ చేస్తూంటుంది. ఈ కథలో రెండు ప్రధాన పాత్రలు పంతులు ధనిక వర్గానికి, అధికార వర్గానికి ప్రతీక. ఉన్నవాళ్ల ఇంట్లో అన్ని సదు పాయాలుంటాయి. పంతులుకు ఏ లోటులేదు. కానీ ఎల్లవ్వ రోజంతా కష్టపడుతుంది. అయినా కొడుకు పాలు అడిగితే పోయలేని పరిస్థితి. చంటిపిల్లాడు జ్వరంతో బాధపడుతున్న పనిమానలేని పరిస్థితి. ఇట్లా ఈ కథలో రెండు వైరుధ్యమైన పాత్రలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. 1998లో వెలువడిన 'స్మృతి' కథల సంపుటిలో పదిహేను కథలున్నాయి. రచయితలోనే మూడు విభాగాలుగా చేసి కథలను ప్రచు రించారు. సదువు కథలు పేదవాళ్ల మెట్లుగా ఉపయోగించుకోవాలని తెలియజేసిన కథలు. బహుజన ప్రేమ కథలు, ప్రేమ కథలు తెలంగాణ చరిత్రను, ఇక్కడి వాస్తవ జీవన పరిస్థితులను వర్గ, కుల అస మానతలను తెలియజేస్తాయి.మమతలు మానవ సంబంధాలు కథల సంపుటి 2000 సంవత్సరంలో వెలువడింది. ఇందులో 16 కథలున్నాయి. వీటిని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి కుటుంబ సంబంధాల్లో సామా జిక ఆర్థిక చరిత్ర, రెండు సామాజిక ఆర్థిక నేపథ్యంలో మానవ సంబంధాలు రచయిత స్వయంగా సామాజిక తత్వవేత్త కావడం వల్ల సమాజంలోని చారిత్రక, ఆర్థిక, రాజకీయ కోణాలను పాత్రలద్వారా, సంఘటనల ద్వారా జీవన సాదృశం చేయగలిగారు.
ప్రపంచీకరణను తెలియజేసే 'వేపచెట్టు'
2003లో వేప చెట్టు కథల సంపుటి వచ్చింది. ప్రపంచీకరణ పరిణామాలను చిత్రించిన తొలి కథాసంపుటి ఇది. నాగశీల అయిదవ వాడు, చేయుత, సంబంధం ప్యారసైట్సు, 'వేపచెట్టు' మొదలైన కథలు ప్రపంచీకరణ అనుకూల ప్రతీకూల అంశాలు తెలియజేశాయి. వేపచెట్టు కథ ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎం.ఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. ఒక దేశ వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ.తమ ప్రయోజనాలకు అనుగుణంగా వర్థమాన దేశాల ఆర్థిక, రాజకీయ విధానాన్ని రూపొందించడానికి సంపన్నదేశాలు అనుసరిస్తున్న వ్యూహమే గ్లోబలైజేషన్. అయితే ప్రపంచీకరణ కొందరి జీవితాలను అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే మరికొందరు ప్రపంచీ కరణలో కనుమరుగైపోతున్న మధ్యతరగతి, పేదవర్గాల పిల్లల చదువులు, అందుకున్న ఫలాలు విశ్లేశించబడ్డాయి. ధనిక వర్గానికి చెందిన రాజేశ్వరరావు అమెరికా వెళ్లి డాలర్లు సంసాదిస్తాడు. అదే గ్రామానికి చెందిన మధ్యతరగతి వర్గ టీచర్లు వాళ్ల పిల్లలకు ఇంజనీరింగ్ విద్యను అందించ గలుగుతారు. శ్రామిక వర్గానికి చెందిన పాలేరు కొడుకును ఇంజనీర్ను చేయలేకపోతాడు. కథలో మైసయ్య రాజేశ్వరరావు తండ్రి దగ్గర పాలేరు. రాజేశ్వరరావు ఇరవై ఏండ్ల క్రితమే సొంత ఊరు వదిలి పట్నం వెళ్లాడు. అక్కడ నుండి అమెరికా వెళ్లాడు. అమెరికాలో పేరుమోసిన డాక్టరు. కథలో ఇరవై రోజుల క్రితం అమెరికానుండి పట్నం వచ్చి, అక్కడ నుండి సొంత ఊరు వాళ్లని కలిసిపోదామని వచ్చాడు. రాజేశ్వరరావును కలవడానికి ఆ వూరి టీచర్లు, పాలేరు మైసయ్య కూడా వెళ్లారు. టీచర్లు పాఠశాల అభివృద్ధికి చందాలు అడిగారు. వారికి రాజేశ్వరరావు చందాలిచ్చాడు. మైసయ్య కూడా ఏదో ఒకటి అడగాలని మనసులో అనుకున్నాడు కానీ మనసులోని మాట పెదవి డాటలేకపోయింది. ధైర్యం తెచ్చుకొని అడుగుతాడు. రాజేశ్వరరావు కోచింగ్ డబ్బులు ఇస్తాను తెల్లవారుజామున రమ్మంటాడు. అనుకోకుండా ఏదో పనిబడి ఉన్నపలంగా వెళ్లిపోతాడు. మైసయ్య కొడుకు మహేష్ చదువులో ఎంతో చురుకైనవాడు. అటు బీటెక్కు అందుకోలేక, ఇటు పై చదువులను కొనసాగించలేక. తండ్రిలాగానే కూలీవాడుగా జీవితం కొనసాగిస్తుంటాడు. టీచర్ పిల్లలు బీటెక్ చదువులు అందిపుచ్చుకోని ఉన్నతంగా ఎదుగుతారు. కొన్ని సంవత్స రాలు. తర్వాత రాజేశ్వరరావు హైటెక్ సిటీ హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెడ దామని సన్నాహాలు చేస్తున్న క్రమంలో మహేశ్ రాజేశ్వరరావును గుర్తుపట్టి వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వా లని అడుగుతాడు. కథా ముగింపులో ఇంజినీర్గా పెట్టుకుందామన్న మహేశ్ వాచ్మెన్ పని అడగ డంతో రాజేశ్వరరావు కళ్లలోంచి నీళ్లు జలజలరాలాయి. అన్న వాక్యా లు శ్రామిక వర్గం ప్రపం చీకరణ ఫలాలు అందుకోవడానికి ఉన్న అడ్డంకులను, ఆర్థిక అవరోధాలను తెలియజేస్తుంది.
కథా మార్గం.. ఓ మైలురాయి
2004లో తేనే టీగలు, కథల సంపుటి 2005లో ' బతుకు పయనం' కథల సంపుటి, ఆ తర్వాత 'కాలం తెచ్చిన మార్పు', 'చికాగోలో నానమ్మ', ' గెలుచుకున్న జీవితం', బీసీ కథలు మొదలైన కథా సంపుటులను వెలువరించాడు. బతుకు పయనం కథా మధ్యతరగతి బీసీ వర్గం ఉన్నతంగా ఎదిగిన తీరును కళ్లకు కడుతుంది. కథలో లక్ష్మయ్య కూలీకి బట్టలు నేసే నేత కార్మికుడు. అతడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదివి బెంగూళూర్లో ఉద్యోగం చేస్తుంటాడు. చిన్నకొడుకు డిగ్రీ ఫేలయ్యాడు. బిడ్డలిద్దరు ఏడవ తర గతి వరకు చదివిన తర్వాత పై చదువులను మానేసి బీడీలు చేస్తూ అన్న చదువుకు ఆసరవుతుంటాడు. లక్ష్మయ్య పెద్దకొడుకు రవిప్రకాష్కు ఇంజ నీరింగ్ సంబంధం వస్తుంది. పెళ్లి జరిగి ఇద్దరు అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేస్తూ ఇండియాకు డబ్బులు నడిపిస్తుంటారు. ఆ డబ్బుతో లక్ష్మయ్య ఆడపిల్లల పెండ్లిళ్లు, చిన్నకొడుకు వ్యాపారం పెట్టి స్తాడు. ఈ విధంగా కుటుంబం లోని ఒక్కరి చదువు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో చేయూతని వ్వగలిగింది. ఈ విధంగా యాభై ఏండ్ల కథా ప్రయాణంలో విప్లవ పోరాటాలను మొదలుకొని నేటి ప్రపంచీకరణ ప్రభావాల వరకు అనేక చారిత్రక మలుపులను, ఆస్తిత్వ, ఉద్యమాలను, దళిత, బహుజన, స్త్రీవాద కోణాలను కథా వస్తువులుగా ఆవిష్కరిస్తూ వస్తున్నారు. వీరి కథామార్గం ఒకమైలు రాయి.
- డా|| ఎం. దేవేంద్ర
కోఠి మహిళా కళాశాల
హైదరాబాద్
9490682457.
Authorization