భారతావని సకల సంపదలకు పుట్టినిల్లు. ముఖ్యంగా తెలుగు సాహితీ సంపద అపారమైనది, అద్భుతమైనది విశిష్టమైనది. తెలుగు సాహిత్యపూదోటలో పురాణాలు, ఇతిహాసాలు, శతకాలు, కథలు, నవలలు, కవిత్వం మొదలగు 'ఎన్నో ప్రక్రియలు విరబూసి ఎప్పటికప్పుడు సాహిత్యాభిమానులకు పరిమళాలను అందజేస్తూనే ఉన్నాయి.
స్త్రీలకు విద్య నిషేధం అంటూ అంధకారం అలముకున్న అలనాడే మహిళలు పొలం పనులు, వంటపనులు, ఇంటి పనులెన్నో... చేస్తూ వారిలో దాగిన సృజనాత్మకతను పాటల రూపంలోనో, కథల రూపంలోనో, లేక అందమైన పదాలు అలవోకగా అల్లి వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు. అంతులేని సాహిత్యం సృష్టించారు. ఇక అక్షరజ్ఞానం అబ్బిన తర్వాత వారి కలాలను ఆపటం ఎవరికి సాధ్యం. అలనాటి విరియాలకామసాని, కుప్పాంబిక మొదలు నేటి ఆధునిక కవయిత్రులు, రచయిత్రులెందరో సాహిత్య క్షేత్రాన్ని తమ తమ రచనలతో సుసంపన్నం చేశారు. చేస్తూనే ఉన్నారు. మహిళా కలం వర్షించే అక్షర ధార ఆనాడు ఈనాడు ఏనాడైనా అమృతతుల్యమే.
మొదట తెలుగులో పద్య రచన చేసిన కవయిత్రిగాను, క్రీ.శ.1000కి చెందిన మహిళాశిరోమణి అగుట వల్ల మరియు కవి పేరు లేని గూడూరు శాసనాన్ని ఆమె వేయించుటచే తానే ఆ శాసనాన్ని రచించి వేయించి ఉండొచ్చునని వివిధ మాధ్యమాలలో వ్యక్తమవడం వల్ల ముందుగా విరియాల కామసాని కవయిత్రి గూర్చి తెలుసుకుందాం ....
ఆంధ్ర వ్మాయ చరిత్రము-దివాకర్ల వెంకటావధాని గారి ప్రకారం గూడూరు శాసనం దాదాపు క్రీ.శ.1124 ప్రాంతము నాటి స్తంభశాసనం. ఇది వరంగల్ జిల్లా జనగామ తాలూకాలో ఉంది. ఈ శాసనంపై ఒకవైపు తెలుగులో మూడు వైపుల కన్నడంలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. ఇది సంస్కృత ఛందస్సు కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం. తెలుగు శాసనములు-పరబ్రహ్మశాస్త్రి గారి ప్రకారం ఇందలి విషయం క్రీ.శ.1000 కాలం నాటిది. తెలుగు భాగంలో ప్రశస్తి పద్యములు తప్ప దాన, సంవత్సరాల విషయాలేవీ లేవు. గూడూరు శాసనంలోని పద్యాలు కాకతీయ రాజ్య విరియాల వంశస్తుల ఘనతని చాటుతున్నాయి. ఈ శాసనంలో ముఖ్యంగా ఐదు పద్యాలు ఉన్నాయి. అందులో 3 చంపకమాలలు, 2 ఉత్పలమాలలు కనిపిస్తాయి. మొదటి పద్యంలో, రెండవ పద్యంలో కాకతీయ విరియాల వంశస్తుల పూర్వచరిత్ర, అలాగే రెండవ పద్యంలో 'విరియాల భీమ' అనేది ప్రథమైకవచనంలో తత్సమరూపం అని పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం. మూడవ పద్యంలో కొంచెం చరిత్రకి సంబంధించిన సందేహాలు గలవని, నాలుగో పద్యంలో విరియాల ఎర్రభూపతి భార్య కామవసాని(కామసాని) చిన్నవాడగు గరుడుడు అను కాకతి రాజును కాపాడి బల్లవ రాజు యొక్క ఆశ్రయం చేరి చక్రవర్తి అనుగ్రహం పొంది కాకతి వంశం ప్రతిష్ఠించాడని వ్యక్తపరిచారు. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం కాకతి వంశం పతనమయ్యే సమయాన విరియాల కామసాని రక్షించిందని తెలుస్తుంది.ఐదవ పద్యంలో సూరని ఘనత వర్ణించబడింది.'
ఈ శాసనపద్యాలలో 'ర' ' ల' ల కు భేదం అంతగా పాటించలేదని పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం .ఐదవ పద్యంలో ప్రాస స్థానమున 'ల' కు బదులు ' '' కారకకాలుడై'' అని ' ర' ను వాడినాడు.కాలకకాలు అనటమే యుక్తం.అనగా కాలయముడు లేక కాలాంతకుడు అని అర్థం.ఈ సురడే కన్నడ భాగంలో చెప్పబడిన మల్లన్న తాత అగుసురడు.ఈ శాసనం కాకతీయుల మొదటి చరిత్రకు కొఱవి రాజులైన ముదిగొండ చాళుక్యుల చరిత్రకు చాలా ముఖ్యమైనది .ఇందు పద్యాలన్నీ సంస్కత వత్తముల ఛాయలను కల్గిన తెలుగు వత్తములు. మొదటిపద్యంలో తప్ప మిగతా నాలుగు పద్యాలలో ప్రాస మలుపు తీసుకోవడం జరిగింది.అంతే గాక తత్సమ దేశ్య పదాల మిశ్రితమై నన్నయ భారతం లోని పద్యశైలిని గుర్తుచేయుచున్నవని డా '' జి.నాగయ్య గారు అభిప్రాయపడ్డారు. ఈపద్యంలో '' పాండవ మధ్యమ భీముడోయనన్ గా '' మున్నగు చోట్ల అలంకారయుత రచన కనిపిస్తుందని దివాకర్ల వెంకటావధాని తెలిపారు.
మొత్తంగా చూస్తే రూపక ఉత్ప్రేక్ష అలంకారాలతో ఈ శాసనం చక్కగా రాయబడినది. అంతర్జాల సమాచారం ఆధారంగా గూడూరు శాసనం తెలుగులో తెలంగాణాలో తొలి వత్త పద్య శాసనంగా కూడా కొందరు భావిస్తున్నారు. అంతే కాకఒక మహిళచే రాయబడి వేయబడిన శాసనంగా మన్ననలు అందుకుంది విరియాల కామసాని గూడూరు శాసనం. కుప్పాంబిక (క్రీ.శ.1230 - 1300 ప్రాంతం) తెలంగాణ సాహిత్య జగత్తు అంతా గర్వించదగిన పాలమూరు ఆడబిడ్డ.తెలంగాణ ప్రాశస్త్యాన్ని ఇను మడింపజేసి, మహిళా సాహిత్యక్షేత్రంలో తొలి బీజాలు వేసిన కాకతీయుల కాలం నాటి కవయిత్రి కుప్పాంబిక.తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబికే అని ఎంతో మంది విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగులో తొలి రామాయణం అందునా అతి మధురమైన ద్విపదలో రంగనాథ రామాయణం రాసిన గోనబుద్ధారెడ్డికి ఆమె కుమార్తె.మల్యాల గుండనాథునికి సహధర్మచారిణి.గోన వంశం,మల్యాల వంశం వాళ్లు కాకతీయులకు సామంతులు. ఇలా గోన,మల్యాల ఇరువంశాలకు చెందిన మహిళాతేజం కుప్పాంబిక.మల్యాల గుండనాథుని ఆస్థానంలో ఈశ్వరభట్టోపాధ్యుడు అనే ఉద్దండ పండితుడు ఉండటం చేతనూ తండ్రి గోనబుద్ధారెడ్డి నుండి వారసత్వంగా సాహితీ సంపదను అందుకొనడం చేతనూ కచ్ఛితంగా కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రి అని సంగిశెట్టి శ్రీనివాస్ వంటి విశ్లేషకులు భావిస్తున్నారు. ఈశ్వరభట్టోపాధ్యాయుడిచే విరచితం కాబడిన బూదపుర్ శాసనం ఆధారంగా కుప్పాంబిక క్రీ.శ.1230 ప్రాంతంలోనే జన్మించి ఉండొచ్చని భావిస్తున్నారు.అంతే కాక ఆమె భర్త మల్యాల గుండన క్రీ.శ.1270 దశకంలో మరణించిన తర్వాత క్రీ.శ.1276 లో బూదపుర్ శాసనాన్ని ఇప్పటి మహబూబ్నగర్ జిల్లాలోని బూదపుర్ ( బూత్పూర్) లోఆమెనే వేయించడం జరిగింది. కుప్పాంబిక సోదరులు కాచభూపతి, విఠలనాథుడు మొట్ట మొదటి సోదర జంటకవులుగా చెప్ప బడుతున్నారు.వీరు రంగనాథ రామాయణం లో ఉత్తరకాండను పూర్తి చేశారు.
కుప్పాంబిక ధీరత్వం,శూరత్వం కలబోసిన నాయిక.ఆమె ఒక వీరుడికి కూతురుగా,మరో వీరుడుకి పత్నిగా వర్ధిల్లడమే కాక అందమైన,అద్భుతమైన పద్య నైవేద్యాన్ని సాహితీప్రియులకు అందించిన మహిళాసాహితీ మణిదీపం.
అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యానొకదాన్ని పేర్కొన్నారని సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆనాడు ఈనాడు ఏనాడైనా యవ్వనం అనేది ఎవరికైనా మధురా నుభూతి.బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న కుప్పాంబిక తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేక పోవడం గురించి ఆ పద్యంలో చాలా హద్యంగా రాసిందని సంగిశెట్టి వారు తెలిపారు.16 వ శతాబ్దం నాటి మొల్లకు 200 ఏండ్లకు ముందు కవిత్వం రాసిన కుప్పాంపిబికే తొలి తెలుగు కవయిత్రిగా నిర్ధారించారు.అయ్యలరాజు సంకలనం చేసిన గ్రంథంలోని కుప్పాంబిక పద్యం :
మ'''' వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు నూ
తన బాల్యధిక యవ్వనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుపనాహా! సిగ్గుమైకోదు పా
వన వంశంబు స్వతంత్రమియదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే
ఇంతటి రమ్యమైన పద్యన్ని 13 వ శతాబ్ది కాలంలోనే ఒక మహిళ అందించడం అందునా పైకి చెప్పలేని భావజాలాన్ని తన మనఃస్థితిని మధురమైన పదాల కూర్పుతో అల్లడం కుప్పాంబిక రచనా వైశిష్ట్యానికి తార్కాణం.
ఈ విధంగా విరియాల కామసాని, కుప్పాంబిక మొదలుగా నారీ మణులెందరో అమూల్యమైన సాహితీసిరులను తెలుగు లోగిలికి అందించి వాగ్దేవి ఒడిని తమ కలాలు చిందించిన అక్షరసుధలతో నింపారు.నేటి మహిళా సాహితీ మూర్తు లెందరికో ఆదర్శప్రాయమై నిలిచారు.
కవి,రచయిత్రి
ఉప్పల పద్మ
ఫోన్ నె:
Authorization