నదులకు ప్రవాహ లక్షణం. ప్రవహిస్తూ ప్రదేశాలను సస్యశ్యామలం చేస్తాయి. కొందరికి తల్లిదండ్రులు పెట్టే పేర్లు వారి వ్యక్తిత్వానికి, వారి మానసిక లక్షణానికి తగినట్టుగా చక్కగా అమరుతాయి. 'నర్మద' నది. భారతీయ సంస్కృతిలో భాగమైన పవిత్ర నదులలో ప్రముఖమైనది. సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే కుటుంబం నుంచి వచ్చిన నర్మదకు పర్యటన జీవ లక్షణమైంది. ఆమె వ్యక్తిత్వంలో ప్రవహించే గుణం ఉన్నందునే దశాబ్ది కాలంలో ప్రపంచంలో ప్రాచుర్యం లేని టహిటి చిన్న ద్వీపం మొదలు అతిశీతల ఖండం అంటార్కిటికా వరకు 150 దేశాలు పర్యటించారు. భక్త బాల్రెడ్డి సహచరిగా తన ముగ్గురు పిల్లలతో కొన్ని దేశాలు పర్యటించిన మరి కొన్ని దంపతులు ఇరువురు దర్శించారు. అభిరుచి ఇరువురిది ఒక్కటే కావడం విశేషం.
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
నర్మదరెడ్డి రచయిత్రి కాదు కవయిత్రి కాదు చిత్రకారిణీ కాదు. కాని తాను దర్శించిన దేశాలు, విశేషాలు, ఎదుర్కొన్న సంఘటనలు పలువురికి తెలియజేయాలన్న తపన ఆమెను రచయిత్రిని చేసింది. ప్రదేశాలను విశ్లేషించడంలో, దృశ్యాలను కనుల ముందు కదిలించే విధంగా చిత్రీకరించిన చిత్రకారిణయింది. ఉద్విగ భరితమైన సంఘటనల విశేషాలను ఉద్వేగంగా అక్షరీకరించడంలో కవయిత్రిగా మారింది.
ఏనుగు వీరాస్వామి రచించిన కాశీయాత్ర వంటి గొప్ప గ్రంథం, కాశీ మజిలీ కథలు వంటి నాటి కాలం నుంచి నేటి కాలంలో ప్రముఖ కవులు డాక్టర్ గోపీ, డాక్టర్ జే.బాపురెడ్డి వంటి వారలు తాము పర్యటించిన ఐదు, ఆరు దేశాల విశేషాలను తమ అనుభవాలను గ్రంథస్తం చేశారు. వీటికి సరితూగే విధంగా నర్మదారెడ్డి పర్యటన విశేషాలను రెండు సంపుటాలు 'ఆగదు మా ప్రయాణం(తొలి సంపుటి)', 'కొలంబస్ అడుగు జాడల్లో మా ప్రయాణం(రెండో సంపుటి)' అక్షర బద్ధం చేశారు. ఇటీవల ఆవిష్కరించబడిన కొలంబస్ అడుగుజాడల్లో మా ప్రయాణం సంపుటి, ఆగదు మాప్రయాణంకు కొనసాగింపు. ఆమె మాటల్లోనే - భూమిపై ఉన్న 7 ఖండాలు, ప్రాచీన, ఆధునిక, ప్రపంచ వింతలు సప్తసముద్రాలు అన్ని చుట్టేశానని చెప్పారు. నిజమే. కొలంబస్ అమెరికాను కనుగొనేందుకు ఏ మార్గం గుండా పయనించారో, ఆ మార్గంలోనే నర్మదారెడ్డి దంపతులు 35,600 కొలోమీటర్లు, 30 రోజుల ప్రయాణం చేయడం అత్యంత తృప్తినిచ్చిందని తెలిపారు. సంపుటిలో వివిధ ప్రాంతాల్లో తాము దిగిన చిత్రాలను కూడా పొందుపరచారు కాని, వీటిల్లో అధిక భాగం ఆ ప్రాంత క్లోజ్అప్లో విశేష ప్రాధాన్యత చిత్రీకరించేదాని కన్నా రచయిత్రికే ప్రాధాన్యమిచ్చేవిగా ఉన్నాయి. అయితే ప్రతి దేశానికి సంబంధించిన రూట్ మ్యాప్, పర్యాటకులకు అత్యంత ఉపయుక్తం. పర్యటనా అనుభవాలను గ్రంథస్తం చేసేవారు, వారి, వారి దృష్టి కోణంలో రచిస్తారు. చరిత్రకారులు ఆ ప్రాంత భాష, సంస్కృతి, భాషా వ్యవహారాలు, జీవన విధానం, ఆచారాలు భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు వీలుగా అక్షరీకరిస్తారు. కవులు భావోద్వేగాలతో తమ అనుభవాలను పంచుకుంటారు. వివిధ ప్రాంతాలలో పర్యటించి అక్కడి విశేషాలను పంచుకుని తమ ప్రయాణపు ముచ్చట్లను ఇతరులతో పంచుకునేందుకు తపనతో రచనలు చేస్తారు. నర్మదారెడ్డి ప్రధానంగా తాము పర్యటించిన ప్రదేశాల వింతలు, విశేషాలపై దృష్టి సారించి విదేశీయాత్ర చేయాలనుకునే వారికి ఎంత పొదుపుగా ఎలా ప్రయాణం చేయవచ్చో, అచటి వసతి, ఇతర సౌకర్యాలను గ్రంథస్తం చేసి దిశానిర్దేశం చేశారు. తాను రచించిన విశేషాలు పఠణీయంగా ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు సాహితీ మిత్రులు ప్రొఫెసర్ నారాయణరావు ద్వారా 'నవతెలంగాణ'కు పంపినట్టు తెలిపారు. నవతెలంగాణ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను రచయిత్రిగా నిలిపింది. అందుకనే ఆ పత్రిక వారికి కృతజ్ఞతలు ప్రకటించారు. కొలంబస్ జీవిత కథను తొలిపేజీల్లో ఆసక్తికరంగా వివరించడం సంపుటికి అదనపు ఆకర్షణ. పరిచయ వాక్యాల్లో ప్రొఫెసర్ ఆదినారాయణ 'సుదూర ప్రాంతాలను సంచారం చేసిన తొలి తెలుగు మహిళ, తెలంగాణ స్త్రీ నర్మదారెడ్డి' అని ప్రశంసించారు. విద్యాధికురాలైన నర్మదారెడ్డి, యాత్రికురాలిగా, గాయనిగా, రచయిత్రిగా, రూపాంతరం చెందుతూ ఉమెన్ అచీవర్స్ అవార్డు, ఉమెన్ అండ్ గ్లోరీ ఉద్గ్రంథంలో దక్షిణ భారత ప్రముఖ మహిళగా గుర్తింపు అందుకున్నారు. ఇది ఆమె కృషి, ప్రతిభకు తొలి గుర్తింపులే, రాష్ట్ర , జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు గుర్తించేంత ప్రజ్ఞావంతురాలు నర్మదరెడ్డి.
ముఖ చిత్రం ప్రపంచ చిత్రపటంపై దంపతుల చిత్రం కన్నా మరింత విస్తృతి లో ఆలోచించే గ్రంథ ప్రాధాన్యత పెరిగేది. ప్రతి ఒక్కరూ చదువదగ్గ కొలంబస్ అడుగు జాడల్లో మా ప్రయాణం. ప్రచురణ : సంహి ప్రచురణ
Authorization