మనకు జీవితకాలంలో రెండు పర్యాయాలు దంతాలు వస్తాయి. బాల్యంలో వచ్చిన 20 పాలపళ్ళు వూడి వాటి స్థానంలో 32 శాశ్వత దంతాలు వస్తాయి. ప్రతి పన్నుకు చిగురుకు పైన కిరీటం అనే భాగం ఉంటుంది. ప్రతి పన్నుకు అది ఉన్న స్థానాన్ని బట్టి ఒకటి నుండి మూడు మూలములుంటాయి. చిగురు బయట కనపడే భాగాన్ని కిరీటం అని, లోపల ఉండే భాగాన్ని 'మూలము' అని అంటారు. పళ్ళలో గట్టిగా పసుపుపచ్చగా ఉండే పదార్థం ఉంటుంది. దీనిని డెంటిన్ అంటారు. బయటకు కనపడే కిరీటభాగాన్ని పింగాణీ (ఎనామిల్) అనే తెల్లటిపొర దట్టంగా కప్పి ఉంచుతుంది. ఇది మన శరీరంలోకెల్ల కఠినమైన భాగం. పింగాణీ పొర రాయిలా గట్టిగా ఉంటుంది. దీని పరమాణువులు ఒక క్రమపద్ధతిలో అమరి ఉంటాయి. ఈ అమరికను స్ఫటికాలు అంటారు. పింగాణీ పొరను మరింత గట్టిపరచే రసాయన పదార్థం ఫ్లోరైడ్. మనం ఫ్లోరైడ్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకున్నట్లయితే దీని పరమాణువులు, ఇతర పరమాణువులను తొలగించి 'క్రిస్టలిన్' అమరిక పొందుతాయి. ఫ్లోరైడ్ అణువులు దగ్గరగా హత్తుకుంటాయి కాబట్టి పింగాణీ పొర మరింత దృఢమవుతుంది. ఎనామిల్ ఎంత గట్టిగా ఉంటే పళ్ళు పుచ్చే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అనేక నగరాలలో మంచినీటిలో ఫ్లోరైడ్ను కలిపి సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని తాగిన పిల్లల పళ్ళ పింగాణీ పొర గట్టిపడుతుంది. ఫ్లోరిన్కు ఒక మూలకం లేక మూలకాల సమూహాలను కలిపినపుడు ఏర్పడే సంయోగ పదార్థమే ఫ్లోరైడ్. దీనిలో చాలా భాగం లవణాలే ఉంటాయి. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంతో లోహపు ఆక్సైడ్ను చర్యనొందిస్తే ఇవి తయారవుతాయి.
Authorization