విజయపురి రాజు మాధవవర్మ మంత్రి అప్పయ్యతో కలిసి కాలినడకన మారు వేషంలో నగర సంచారం చేస్తున్నాడు.
నగర శివారులో నిర్మిస్తున్న భవనానికి ఇటుకలు మోస్తూ వృద్ధ దంపతులు కనిపించారు. మాధవవర్మ వారిని పలకరించాడు.
''తాతా! ఈ వయసులో కూలిపనులు చేస్తున్నావే, మిమ్మల్ని పోషించడానికి కొడుకులు లేరా?'' అన్నాడు.
''అయ్యా! నాకు ఒక్కడే కొడుకు కేశవులు. పెళ్ళయిన తర్వాత మా బాగోగులు పట్టించుకోవడం లేదు. నా సంపాదన పెళ్ళాం, పిల్లల్ని పోషించడానికే సరిపోతున్నది. మిమ్మల్ని కూర్చోబెట్టి మేపలేను. బాగానే వున్నారుగా! పని పాటలు చేసుకుని బతకండి. రాజధాని నగరంలో ఏదొక పనిదొరుకుతుంది. అని మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమాడు'' అంటూ తన కథ వివరించాడు మల్లయ్య.
''అయ్యగారూ! కొడుకుల్ని కనిపెంచడం కంటే కొబ్బరి చెట్లని పెంచడం మంచిదని పెద్దలు చెప్పేది ఎంతో నిజం. ఆ చెట్లు జీవితాంతం ఫలసాయం యిస్తూ మనల్ని ఆదుకుంటాయి'' అన్నది మల్లయ్య భార్య మాణిక్యమ్మ.
''ఈ వయసులో శారీరక శ్రమ చేయడం ఎంతో కష్టం. మీకు నాలుగు పాడి ఆవులు, పదిగొర్రెలు ఇస్తాను. వాటిని మేపుకుంటూ పాలు, పెరుగు, నెయ్యి అమ్ముకుంటూ హాయిగా బతకండి. నగరంలో వాటికి ఎంతో గిరాకీ వుంది'' అన్నాడు రాజు.
మల్లయ్య దంపతులు ఎంతో సంతోషించారు.
రాజు తను మాట యిచ్చిన విధంగా వారికి గొర్రెలు, ఆవులు పంపించాడు.
కొడుకు నిర్లక్ష్యానికి గురైన వృద్ధ దంపతులను ఆదుకున్నానని తృప్తి పడ్డాడు మాధవవర్మ.
కొంత కాలం తర్వాత రాజు, మంత్రి నగర సంచారం చేస్తుండగా మల్లయ్య ఒక గిడ్డంగి దగ్గర మూటలు మోస్తూ కనిపించాడు.
''మల్లయ్యా? ఎందుకు కూలి పనులు చేస్తున్నావు? నువ్వు నీ కాళ్ళ మీద హాయిగా బతుకుతావనేగదా నీకు పాడి ఆవులు, గొర్రెలు ఇచ్చాను. పాలు, పెరుగు అమ్ముకోవచ్చు. గొర్రెల బొచ్చు కంబళీలు నేసేవారు కొనుక్కుంటారు. ఏమైంది నీకు?'' అని రాజు నిలదీశాడు.
రాజు మాటలకు మల్లయ్య వల వలా ఏడవడం మొదలు పెట్టాడు.
''అయ్యా! మీరు చెప్పినట్టే ఆవుల్ని, గొర్రెల్ని మేపుకుంటూ బతుకుతున్నాం. మా దగ్గర ఆవులు, గొర్రెలు వున్నట్టు ఎలా తెలిసిందో నా కొడుకు, కోడలు మా దగ్గరికి వచ్చారు. అందరం ఒక చోట హాయిగా వుందాం. అని మాయమాటలు చెప్పి వూరు తీసుకెళ్ళాడు. కొంత కాలం మమ్మల్ని బాగానే చూశారు. తర్వాత ఆవులు, గొర్రెల్ని అమ్ముకుని మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు'' అని జరిగింది చెప్పాడు మల్లయ్య.
మాధవవర్మ విస్తుపోయాడు. కొడుకులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? కన్న తల్లిదండ్రుల యెడల అని ఆశ్చర్యపోయాడు.
మల్లయ్య లాంటి వృద్ధులు కొడుకుల నిరాదరణకు గురైన వారు ఇంకెందరు వున్నారో? అనే ఆలోచన కలిగింది.
రాజభటులను పంపించి మల్లయ్య కొడుకు, కోడల్ని సభలోకి రప్పించాడు. వారు కన్న తల్లిదండ్రుల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందీ సభికులకు వివరించాడు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా వున్నారని నిందించాడు.
ఇక నుంచి రాజ్యంలో ఎవరైనా కన్నతల్లిదండ్రుల పట్ల నిరాదరణ చూపినా, ఇంటి నుంచి వెళ్ళగొట్టినా శిక్షతప్పదు. కారాగారంలో జీవితఖైదు అనుభవించవలసి వస్తుంది. ఎవరైనా తల్లిదండ్రుల్ని నిరాదరిస్తుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను'' అని రాజు సభలో ప్రకటించాడు.
ఆ విధంగా రాజు రాజ్యంలో చాటింపు వేయించాడు. అప్పట్నుంచి విజయపురి రాజ్యంలో వృద్ధులు సుఖంగా జీవించారు.
- వాణిశ్రీ
9390085292
Authorization