అదొక పండ్ల బజారు. అక్కడ పండ్ల దుకాణాలన్నీ వరుసగా ఉంటాయి. మామిడి, బత్తాయి, సపోటా, కమలా, బొప్పాయి, ద్రాక్ష, యాపిల్ వంటి అన్ని రకాల పండ్లూ అక్కడ కొలువు దీరి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా సువాసనతో కూడిన తీపిదనం వ్యాపించి ఉంది. ఆడా, మగా, పిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఆ బజారుకు వస్తారు. పండ్లు బావున్నాయని కొనుక్కుంటున్నారు. సంచుల్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళి అందరూ కూర్చుని ఫలాలను ఆరగిస్తున్నారు. ఎంతో మధురుగా ఉన్నాయని మెచ్చుకుంటూ ఆహా! ఓహౌ! ఏమి రుచి, తీపి అని లొట్టలేసుకుంటూ అంటున్నారు. పండ్లను తిని విత్తనాలను పారేస్తున్నారు. ఫలాలు తీపిగా ఉన్నాయనీ, పుల్లగా ఉన్నాయనీ, పచ్చిగా ఉన్నాయనీ ముదురు పండిపోయాయనీ పండ్లను ఇలా రకరకాలుగా వర్ణిస్తారు కదా! విత్తనాలను అలా వర్ణించకపోయినా ఫరవాలేదు కానీ అది కూడా పండులోని ఓ భాగమే కదా! ఇప్పటి దాకా పండు కడుపులోనే ఉన్నది కదా అని ఎవరూ పలకరించట్లేదు. కనీసం వాటి గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు కూడా! సరికదా విత్తనాలన్నింటినీ తెచ్చి చెత్తకుప్పలో పారబోస్తున్నారు.
విత్తనాలకు చాలా దు:ఖం వచ్చింది. ఏడుపు తన్నుకొచ్చింది. ఇప్పటి దాకా మధురమైన ఫలాల లోపల, తీపివాసనల మధ్య గడిపిన వాటికి చెత్తకుండి దగ్గర దుర్గంధం భరించలేక వాంతి వచ్చినట్టు అనిపించింది. ఒక్కొక్క విత్తనం చెత్త కుప్ప నుంచి దూరంగా జరిగిపోయి అన్ని ఒక చోట గుమికూడాయి. పండును తిన్నట్టు మనల్ని కూడా తినమన్లేదు కానీ, కాస్త గౌరవంగా చూస్తే ఏంబోయింది. అంది మామిడి టెంక చిన్న బుచ్చుకుని నీ పని ఇంకా నయం పండునోట్లో పెట్టుకొని గుజ్జునంతా జుర్పేసి నన్ను ''థూ'' అని బయటకు ఊసేస్తారు. అంది ద్రాక్ష గింజ విచారంగా కాస్త మర్యాదగా నోట్లోంచి తీసి బయట పెట్టొచ్చు కదా అంటూ కమలాకాయ, బత్తాయికాయ విత్తులు వంత పాడాయి. వేరుశెనగ కాయలకు ఎంత అదృష్టమో కాయలు వలుచుకొని మరీ విత్తనాలు అంటారు. నిష్టురంగా అంది సపోటా విత్తనం. వేరు శెనగ కాయలేనా! మొక్కజొన్న కంక కూడా! వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతివారి చేతిలో కంకే ఉంటుంది. దాని విత్తనాలను వేడి వేడిగా కొరుక్కుతింటుంటారు. అన్నాయి బొప్పాయి గింజలు, ఏంటో మనకే ఈ కష్టాలన్నీ అనుకుంటూ దిగులుగా కూర్చున్నాయి విత్తనాలన్నీ. ఏంటీ మీకేనా బాధలు పాత బట్టలు విడిచేసినట్టు మా చర్మం వలిచి విసరి పారేస్తారు. అంటూ అరటి, బత్తాయి, కమలా పండు తొక్కలు తమ గోడు వెళ్లబోసుకున్నాయి. అందరూ కలసి తలా ఒక మాట మాట్లాడుకున్నాక తొక్కలు వెళ్ళిపోయాయి. ఎవరూ పట్టించుకోని ఈ బతుకు మనకెందుకు. అని బాధపడిన విత్తనాలన్నీ తీవ్రంగా ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలి అనే మూకుమ్మడి నిర్ణయానికొచ్చాయి. ఇది వెంటనే అమలు పరచాలి అనుకున్నాయి.
ఏ విత్తనం కా విత్తనం తానున్నచోటే చిన్నగొయ్యి తవ్వుకొని అందులో పడి చావాలనుకున్నాయి. వెంటనే విత్తనాలన్నీ గోతిలో పడి చచ్చిపోయాయి. ఇక అక్కడ మట్టి తప్ప విత్తనాలు ఎవరికీ కనిపించలేదు. కొన్నాళ్ళుకు వర్షం వచ్చింది. మట్టి కిందున్న విత్తనాలు మొలకెత్తాయి. మట్టిలో నుండి తల పైకెత్తి తొంగి చూసాయి. మొలకలు రోజు రోజుకూ పెరగసాగాయి. ఇప్పుడు దారినపోయే వాళ్లదృష్టి వీటిపై పడుతున్నది. మొక్కలు తమ దేహాలను గర్వంగా చూసుకున్నాయి. మరి కొంతకాలం గడిచింది. మొక్కలు చెట్లయ్యాయి. ఇప్పుడవి ఆ దారి వెంట వెళ్ళెవాళ్ళకు నీడనిస్తున్నాయి. ఎండకు గొడుగులయ్యాయి. వానకు అమ్మకొంగులా అడ్డుపడ్డాయి. అంతలో వసంత మాసం వచ్చింది. ప్రకృతి పరవశించిపోతున్నది. చెట్లన్నీ పువ్వులతో కళకళలాడసాగాయి. చుట్టు పక్కాల ఇండ్ల వాళ్ల కండ్లన్నీ ఆ చెట్లపువ్వుల మీదే పూలతో నిండిన చెట్లు మహారాణుల్లా శోభిస్తున్నాయి. అందరూ ఆ పూల సోయగానికి దాసోహం అంటున్నారు. భూ మాత ఆ పూల చెట్లను తన ఇంట అందమైన ఫ్లవర్ వేజ్లుగా అమర్చినానని మురిసిపోతున్నది.
కొంత కాలం తర్వాత పూలన్నీ కాయలుగా మారాయి కాయలు పండి పండ్లయ్యాయి. పండ్లు కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రజలంతా చెట్లనూ, చెట్లకున్నా పండ్లనూ చూసి మెచ్చుకోసాగారు. ఆహా! ఏమి రంగు? ఏమి సువాసన? ఏమి రుచి అంటూ పండ్లను ఆరగించి మైమరచిపోయి మనసారా ప్రశంసిస్తున్నారు. ఆ పొగడ్తలకు పండ్ల చెట్ల హృదయాలు ఉప్పొంగి పోయాయి. మన జీవితం ధన్యమనుకున్నాయి. మనల్ని తక్కువగా చూసి బయటపారేశారని బాధపడ్డాం. కానీ ఒక చెట్టును పుట్టించే శక్తి మన దగ్గరున్నదని గ్రహించలేకపోయాయి. ఒక మహావృక్షాన్ని కనగల అమ్మలమని ఊహించలేకపోయాం. ఆత్మ విశ్వాసం లోపిస్తే మనలోగల శక్తిని మనమే తక్కువగా అంచనా వేసుకొని భగవంతుడు ప్రసాదించిన అందమైన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. సుఖం వచ్చినప్పుడు పొంగి పోకూడదు. కష్టసుఖాలు అనేవి ప్రతివారి జీవితంలోనూ తప్పవు. మనం ఉత్పత్తి చేసే పండ్లు నలుగురూ తినటమే మనకు కావలసినది. వాళ్ళ కడుపు నిండి బావున్నారంటే అదే మనకు ఆశిర్వాదం మనం పుట్టినందుకు పది మందికి మేలు చేయాలి. ఏదో చిన్న కష్టం వచ్చిందని విచారపడకూడదు. తెలివి ధైర్యంతో సమస్యను పరిష్కరించుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ పోగొట్టుకోకూడదు.
- డా|| కందేపి రాణీ ప్రసాద్
Authorization