అర్ధరాత్రి కెవ్వున కేక పెట్టాడు రాజు రతిసేనుడు. పక్కన పడుకున్న ఇద్దరు రాణులు ఉలిక్కిపడి లేచారు. రాజ పరివారమంతా పరిగెత్తుకుంటూ వచ్చింది. రాణులు, దాసదాసీలంతా చుట్టూ మూగారు. ఏం జరిగింది మహారాజా. ఆందోళనగా అడిగింది వేటకు వెళ్లినప్పుడు ఎత్తుకొచ్చిన ఏడో రాణి. విచారంగా ముఖం పెట్టి, కుడి చేతిని ముందుకు చాపాడు. రాణులకు కానీ, దాసీలకు కానీ ఏవీ కనిపించలేదు. ముళ్ల పంది మీద ఈకల్లా వెంట్రుకలు తప్ప. వేలు పెట్టి చూపించాడు. కండ్లు చిట్లించుకొని, పరివారమంతా శ్రద్ధగా పరిశీలించింది. కుడి చేతి మీద ఆవగింజంత పరిమాణంలో చర్మం, ఎర్రగా కనిపించింది.
దోమ కుట్టింది రాణి. ఇంత పెద్ద సామ్రాజ్యానికి రాజునైన నన్ను, ఒక దోమ కరవడం భరించలేక పోతున్నాను అన్నాడు తల బాదుకుంటూ. మహారాజు గారిని దోమ కరవడానికి వీలు లేదు. భటులారా వెదకండి. ఎక్కడున్నా పట్టి బంధించి తెండి. లేదా శవంగానైనా తెచ్చి, మహారాజు గారిచ్చే బహుమతిని అందుకోండి. రాజు గారిని బాధ పెట్టిన దోమ బతకడానికి వీలు లేదు అరిచింది వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు కనపడగా పట్టుకొచ్చిన ఆరో రాణి.
దాసీలు, భటులు కలిసి మూల మూలలా వెదికారు. కానీ వాళ్లకు ఒక్కదోమ కూడా కనిపించలేదు. విచారంగా వచ్చి చెప్పారు. మీకు భయపడి పారిపోయుంటుంది మహారాజా. అన్నది నగర సంచారంలో కనపడగానే రథం మీద తీసుకొచ్చుకున్న ఐదో రాణి. అంతే... అంతే... ముందసలు, ఆ దోమను ఎవరు లోపలకు రానిచ్చారు అది తేలాలి ముందు గద్దించింది నది పక్కన పడవ వేస్తూ, రాజుకు కనిపించగా కట్టుకున్న నాలుగో రాణి. ద్వారం వద్ద కాపలాగా ఉన్న భటుడ్ని లాక్కొచ్చారు. వీడిదే ఇక్కడి రక్షణ బాధ్యత. శిక్షించండి మహారాజా అంది మూడో రాణి. ఆమెను పక్క రాజు తన కూతురని కానుకగా ఇచ్చాడు. కానీ తన ఉంపుడు కత్తెకు పుట్టిన కూతురు. అమ్మాయిని ఇచ్చి, నది నుండి నీళ్లను తీసుకొని, తన రాజ్యాన్ని సస్యశ్యామలం చేసుకున్నాడు. క్షమించండి మహారాజా నేను పురుగును కూడా లోపలకు రానీకుండా, కడు జాగ్రత్తగా కాపలా కాస్తున్నాను. తలుపులకు మధ్యనున్న సన్నని వేలంత సందు గుండా ఆ దోమ లోపలకు వచ్చి ఉంటుంది. అది తలుపులు చేసిన వడ్రంగి నాగాచారిచే తప్ప, నా తప్పు కాదు అని తప్పుకున్నాడు.
అవును మహారాజా ఈ భటుడు ఎప్పుడు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తాడు. తప్పు ఇతనిది కాదు, ఆ వడ్రంగిదే అంది యుద్ధంలో గెలవగానే అంత:పురం మీద పడి ఎత్తుకొచ్చిన పరాయి రాజు భార్య, మన రాజుకు మూడో రాణి-అదోలా చూస్తూ.. పగలంతా కర్ర పనితో కష్టం చేసి, ఆదమరిచి నిద్ర పోతున్న నాగాచారిని లాక్కొచ్చారు. తలుపులు సందు ఉండేలా ఎందుకు చేశావు? అందులోంచి, ఒక పెద్ద దోమ వచ్చి, మహారాజు గారిని కసిక్కిన కరిసింది. రాజు గారికి అర్ధరాత్రి నిద్ర భంగం జరిగింది. ఆ అపరాధానికి సంజాయిషీ ఏమిటి? ఎగబడ్డది బావి కాడ నీళ్లు తెస్తూ, కనిపించగా పట్టుకొచ్చిన రెండో రాణి.మహారాజా ఆ తప్పు నాది కాదు. మంత్రిగారిది. నేను తలుపులు శ్రద్ధగా చేశాను. ఎండిన చెట్టును చూపించి, దాన్ని కొట్టించి, చెక్కలు నాకు అప్పగించమన్నాను కానీ, వాస్తు ప్రకారం కోట పక్కన ఉండకూడదని మంత్రి గారే పచ్చని చెట్టును కొట్టించి, పచ్చి కర్రను నాకిచ్చాడు. వెంటనే చేసి ఇమ్మని తొందర పెట్టాడు. చెప్పిన వ్యవధిలో చేసి, తలుపులు అమర్చాను. కాలం గడిచేకొద్దీ ఎండిన చెక్కలు, సందులిచ్చాయి అన్నాడు వినయంగా.
అయితే మంత్రిని పిలిపించండి అన్నాడు రాజు. పరుగున వెళ్లిన భటులు, రథం మీద మంత్రిని తీసుకొచ్చారు. అర్ధరాత్రి రాజును దోమ కుట్టింది. వడ్రంగికి పచ్చి చెక్కను ఇచ్చినందుకు తలుపులు సందువచ్చి, దోమ లోపలకు వచ్చింది. ఆరుదల చెక్కలు ఎందుకు ఇవ్వలేదు ప్రశ్నించింది స్వయంవరంలోంచి ఎత్తుకొచ్చిన పట్టపు రాణి. రాణి గారు విజ్ఞతతో ఆలోచించాలి. ఆ పక్క చెట్టు ఉంటే, వాస్తు ప్రకారం దోషమని, మహారాజు గారు యుద్ధంలో మరణిస్తారని, రాణి వాసపు స్త్రీలంతా, శత్రుసైనికుల చేత చిక్కి చనిపోతారని ఆస్థాన వాస్తాచార్యులు సెలవిచ్చారు. అందుకే ఆ చెట్టును కొట్టించాను. మనం వాడుకునే కొద్దీ కాలి చెప్పు కూడా వదులవుద్ది. మనం ఆలోచించవలసింది తలుపు సందు గుండా దోమ వచ్చినందుకు కాదు. నెల, నెలా అప్పనంగా జీతాలు తీసుకుంటూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పారిశుధ్య సిబ్బంది గురించి. అంత:పురం నుండి వెలువడిన నీళ్లు, దూరంగా పారేలా చేయాల్సిన బాధ్యత ముత్తయ్యది. మురికి కాలువలు సరిగా శుభ్రం చేయనందున, నీరు నిలువ ఉండి, దోమలు పెరిగి అంత:పురంలో జొరబడ్డాయి. ఇందుకు బాధ్యత ముమ్మాటికి మురికి పనులు చేసే, ముత్తయ్యదే కానీ మరొకరిది కాదు అన్నాడు మంత్రి వర్యులం గారు.
గూడెం నుండి ముత్తయ్యను గుంజుకొచ్చారు భటులు. జరిగిన విషయమంతా చెప్పి, దోమ అంత:పురంలో జొరబడింది. రాజు గారిని కుట్టి, నిద్రభంగం చేసింది. ఇందుకు నీ సంజాయిషీ ఏమిటి? మురికి కాలువలు ఎందుకు సరిగ్గా శుభ్రం చేయడం లేదు గద్దించాడు మహామంత్రి. ముత్తయ్యకు నిజం చెప్పడం తప్ప. అబద్దం చెప్పడం రాదు. నేరాన్ని మరొకరి మీదకు నెట్టడం అసలు తెలియదు. పాపం తను చదువుకోలేదు కదా. అయ్యా నేను రోజూ మురికి కాలువలు
శుభ్రం చేస్తూనే ఉన్నాను. నిన్న ఒక్క రోజు మాత్రం చేయలేదు. నా కూతురుకు జబ్బు చేసి, ప్రాణాపాయంలో ఉంటే, వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లాను. అన్నాడు చేతులు జోడించి, గజగజా వణికిపోతూ. మహారాజు గారికంటే నీ బిడ్డ ఎక్కువా? ఎవరక్కడీ విధుల పట్ల నిర్లక్ష్యం చూపినందుకు ఈ మురికి పని చేసే ముత్తయ్యను పట్టి ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు. రాజు శిక్ష అమలు జరిగిపోయింది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
- పుప్పాల కృష్ణమూర్తి
Authorization