మహాపండితుడు, సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్. 1820లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, దుర్భర ఆర్థిక ఇబ్బందులకోర్చి విద్యాభ్యాసం చేసి, 1851 నాటికి ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ పదవికి ఎదిగాడు. ఆయన సంస్కృత మహాపండితుడైనా పాశ్చాత్య తాత్విక చింతనలో అత్యున్నతమైన దాన్ని గ్రహించాలనే తపన ఉండేది. భారత, పాశ్చాత్య సంస్కృతుల మేలు కలయికకి ఆయన ప్రతీక అయ్యాడు. ఆధునిక భారత నిర్మాణానికి ఆయన చేసిన సేవ బహుముఖమైంది. సంస్కృత భాషా బోధనలో ఆయన ఒక అపూర్వ పద్ధతి కనిపెట్టాడు. ఆయన రూపొందించిన బెంగాలీ ప్రాథమిక వాచకం, ఈనాటికీ వాడుకలో ఉంది. బెంగాలీ భాషలో ఆధునిక వచన శైలి వికసించడానికి, ఆయన రచనలు దోహదం చేశాయి. ప్రస్తుతం ఆయన పేరు పెట్టుకుని నడుస్తున్న ఒక కళాశాల స్థాపనకు ఆనాడు ఆయన విశేష కృషి చేశారు.