పూర్వం ఒక కొలనులో ''కంబుగ్రీవం'' అనే తాబేలు, వికటము, సంకటము అనే రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఎండాకాలం సమీపించింది. హంసలు తాబేలుతో ''మిత్రమా! ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది. కాబట్టి మేము వేరొక సరస్సునకు వెళ్లాలనుకుంటున్నాము'' అన్నాయి. తాబేలు బాధతో ''ఇదేమి అన్యాయము, ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా వదిలి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా? మిమ్ములను చూడకుండా ఒక్కరోజైనా బతకగలనా! ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకొని పొండి'' అని బతిమాలింది.
హంసలు ఒక ఉపాయం ఆలోచించి, ఒక పుల్లను తెచ్చి అవి తాబేలుతో మిత్రమా! నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని ఉండు. మేమిద్దరం చెరొక కొనను మా ముక్కులతో పట్టుకొని పైకెగిరెదము. మా మధ్యలో నీవునూ మాతోపాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు చేరుకోగలవు. మేము చెప్పేవరకు నోరు తెరవవద్దు అని చెప్పాయి. అందుకు తాబేలు సంతోషంతో అలాగే అంది. బయలుదేరే ముందు హంసలు తాబేలుతో ''మిత్రమా! మార్గంలో ఎన్నో పల్లెలు, పట్నాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి జనం గోల చేస్తారు. పిల్లలు కేరింతలు కొడతారు. నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడతారు. నీవు మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నోరు తెరవవద్దు. తెరిచావో కర్ర నుండి విడిపోయి కిందపడి చచ్చిపోతావు'' అని మరొకమారు గుర్తుచేసాయి.
- హెచ్చరికలను తప్పక పాటిస్తాను అని తాబేలు కర్రను నోట కరిచి గట్టిగా పట్టుకుంది. హంసలు - పుల్లను అటూ ఇటూ తమ ముక్కులతో పట్టుకొని ఆకాశానికి ఎగిరాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వచ్చింది. ఈ వింతని చూచి ఆ ఊళ్ళోని పిల్లలూ, పెద్దలూ పెద్దగా అరిచి గోల చేయడం మొదలు పెట్టారు. కొందరు ఈలలు వేస్తున్నారు. తాబేలు ఆకాశంలో ఎగురుతుంది అని హేళన చేయసాగారు. మరికొందరు వెంటపడుతున్నారు.
తాబేలుకు ఆత్రం పెరిగిపోతుంది. ఆ తొందరలో అది హంసలు చేసిన హెచ్చరికను మరిచిపోయింది. కింద ఆ కోలాహలమేమి అని హంసలను అడగబోయి నోరు తెరిచింది. వెంటనే కర్రనుండి విడిపోయి దభీమని కిందపడి మరణించింది. హంసలు చెప్పిన మాటలను అశ్రద్ధ చేయడంతో తాబేలు తన ప్రాణాలను కోల్పోయింది. అందుకే చేసే పనిమీద ధ్యాస ఉంచాలి. అంతేకాదు అతి ఆత్రం కూడా పనికి రాదని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
Authorization