పిల్లలూ.. మనం ఇప్పటి వరకు బుల్లి బుల్లి కీటకాల్ని తినే మొక్కల గురించే చదువుకున్నాం. కానీ పక్కనే ఉన్న ఈ వృక్షం మాత్రం ఏకంగా పక్షులనే చంపేస్తుంది. ఎందుకంటారా? ఆహారం కోసం. దీని పేరు పిసోనియా. దీన్ని మన శాస్త్రవేత్తలు ప్యుర్టోరికాలోని దీవుల్లో గుర్తించారు. దీనికి ఓ రకమైన విత్తనాలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ విత్తనాలు ఇలా ముళ్లుముళ్లులాగే కాకుండా కాస్తంత జిగురునీ ఉత్పత్తి చేస్తాయి. అవి చెట్టుకింద బోలెడు రాలిపోతుంటాయి. వాటికున్న జిగురుకి కీటకాల్లాంటివి బాగా ఆకర్షితమవుతాయి. ఏదన్నా ఆహారం దొరుకుతుందేమోనని చటుక్కున వెళ్లి వాటిపై వాలతాయి. అంతే ఆ జిగురు నుంచి బయటపడలేక అక్కడే చచ్చిపోతాయి. అలా వాటిని చూసిన పక్షులకేమో నోరూరిపోతుంది. దీంతో అవి అలా వాలడం తడవు. కిందున్న జిగురు విత్తనాలన్నీ వాటి రెక్కలకు పెద్ద మొత్తంలో అంటుకుపోతాయి. దీంతో పక్షి అక్కడి నుంచి ఎగరలేకుండా అయిపోతుంది. చివరికి చనిపోయి మట్టిలో కలిసిపోతుంది. దాని వల్ల మట్టిలో వచ్చిన ఖనిజాల్ని చెట్టు వేళ్లతో పీల్చుకుంటుంది. అవి ఈ చెట్టు నుంచి విత్తనాలు రావడానికి, అవి మొలకెత్తడానికీ ఉపయోగపడతాయట.