సుందర్లాల్ బహుగుణ 1927 జనవరి 9న ఉత్తరాఖండ్లోని మరోడా గ్రామంలో జన్మించారు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. వృక్షాలే కాదు.. అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం పరితపించారాయన. కర్ణ ప్రయాగ దగ్గర అడవుల్లో చెట్లను కొట్టివేసి 'పైన్' చెట్లను పెంచుదామని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించినపుడు అక్కడి ప్రజలతో కలిపి విజయవంతంగా నిరోధించారు. ఇలా బహుగుణ నేతృత్వంలో చిప్కో ఉద్యమం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా వ్యాపించింది. గాంధేయ సత్యాగ్రహ విధానాల్లోనే నడిపినందున ఈ ఉద్యమాన్ని 'అడవి సత్యాగ్రహం' అని పిలిచేవారు. గిరిజనులు అడవులను రక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం మొదలైంది. మొదట చెట్లను రక్షించే ఉద్యమంగా, తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పర్యావరణ వేత్తగా ఆయన 1981 నుంచి 1983 వరకు హిమాలయ ప్రాంతంలో దాదాపు 5000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. చివరికి ఢిల్లీ చేరి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి అటవీ వినియోగ పద్ధతులు మార్చాలని కోరారు. ఫలితంగా అప్పటి నుంచి 15 సంవత్సరాల దాకా హిమాలయ ప్రాంతాల్లో చెట్లు కొట్టడాన్ని నిషేధించారు. బహుగుణకు 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి.
Authorization