పిల్లలూ... కుతుబ్ మినార్ గురించి మీరు వినే ఉంటారు...మనదేశంలోనే అత్యంత ఎత్తయిన స్తంభం ఈ కుతుబ్ మినార్. అంతేకాదు ప్రపంచంలో ఇటుకలతో చేసిన ఎత్తయిన స్తంభాల్లో ఇదీ ఒకటి. ఈ మినార్పై చివరను చూడాలంటే మన మెడను వెనక్కి వాల్చాల్సిందే. మరి ఇంత గొప్ప కట్టడాన్ని ఎవరు.. ఎప్పుడు నిర్మించారో మీక తెలుసా..? అవే విషయాలను మనం ఇవాళ్టి బుడుగులో తెలుసుకుందామా...
- ఇండో-ఇస్లామియా నిర్మాణాలకు కుతుబ్ మినార్ ఒక అపురూపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీలోని మెహ్రౌలీ వద్దగల కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది. కుతుబ్ అనగా ధ్రువం, మినార్ అనగా స్తంభం. కుతుబ్ మీనార్ అంటే ధ్రువపు స్తంభం అని అర్థం.
- క్రీ.శ. 1192లో మనదేశంలో మహమ్మదీయ పాలన మొదలైంది. రాజపుత్ర రాజు పృథ్వీరాజును ఓడించి మహమ్మద్ ఘోరీ దిల్లీని ఆక్రమించుకున్నాడు. ఘోరీ తన ప్రతినిధిగా దిల్లీ పాలకునిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయాడు. ఆయన 1192-1206 మధ్యకాలంలో దిల్లీని పాలించాడు. ఆయనే ఈ కుతుబ్మినార్ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. తరువాత వచ్చిన రాజు ఇల్తుత్ మిష్ దీన్ని పూర్తిచేశాడు.
- అయితే ఈ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ మొదలుపెట్టాడు కనుక ఆయన పేరు మీదే కుతుబ్ మినార్ అని పేరుపెట్టారని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు...ఆ కాలంలో కుతుబుద్దీన్ బఖ్త్యార్ కాకి అనే మహమ్మదీయ సాధువు ఉండేవాడట, ఆయన పేరే దీనికి పెట్టారట.
- కుతుబ్ మినార్ 73.7 మీటర్ల ఎత్తుంటుంది. అంటే సుమారు 238 అడుగులు. దీనిని ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. అయితే ప్రస్తుతం నాలుగు, అయిదో అంతస్తులు మాత్రం పాలరాతివి కనిపిస్తాయి. మినార్ కింది భాగంలో వ్యాసం నలభై మీటర్లు ఉంటే, పైకివెళ్లే కొద్దీ తగ్గుతూ చివరికి 3 మీటర్లు ఉంటుంది. అంతస్తు అంతస్తుకూ మధ్య బాల్కనీలు ఉంటాయి. మినార్ లోపలి నుంచి మీదికి వెళ్లేందుకు మొత్తం 379 మెట్లు ఉంటాయి. దీని మీద ఖురాన్ సూక్తులను చెక్కారు
- అయితే ఈ నిర్మాణం వెనుక అనేక కథలున్నాయి. మినార్కు పక్కనే కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదు ఉంటుంది.ఇందులో ప్రార్థనలు చేసేందుకు పిలుపునిచ్చేందుకు కట్టి ఉంటారని కొందరు, దిల్లీ నగరాన్ని పర్యవేక్షించేందుకు, శత్రువులెవరైనా వస్తున్నారేమోనన్న సంగతి కనిపెట్టేందుకు నిఘా కోసం కట్టి ఉంటారని మరికొందరి వాదన. భారతదేశం మీద తమ విజయానికి గుర్తుగా దీన్ని నిర్మించారని అనేవాళ్లూ ఉన్నారు.
- అయితే ప్రతి యేటా జూన్ 22న ఇంత ఎత్తున్న ఈ మినార్ నీడ భూమి మీద పడదు. అత్యద్భుతమైన భౌగోళిక శాస్త్ర నిగూఢతను తెలిసిన నాటి శిల్పులు, కళాకారులు ఎంతో పకడ్బందీగా దీనిని నిర్మించారు. 1193 నుంచి కూడా ఇలానే ప్రతియేటా జరుగుతున్నది. దీనికి కారణం.. ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉన్నది. పైగా 5 డిగ్రీలు వంపు కూడా కలిగి ఉన్నది. ఇలా భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వల్ల ఈ కట్టడం నీడ ఆ రోజున భూమి మీద పడదట.
- కుతుబ్ మినార్ మన దేశ ప్రాచీన నిర్మాణ శాస్త్రానికి మచ్చుతునక అని చరిత్రకారులు చెబుతుంటారు . ఇంజినీరింగ్ ప్రతిభకు కూడా ఇది గీటురాయి. ఆనాడే అంత టెక్నాలజీని ఉపయోగించారు మనవాళ్లు. యునెస్కోవారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కుతుబ్ మినార్ను నమోదు చేశారు.
- అయితే ఈ మినార్ పైకి ఎక్కడానికి 1981 వరకు అవకాశం ఉండేది. 1981 డిసెంబర్ 4న విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో మినార్ ఒరిగిపోతోందని గందరగోళం తలెత్తింది. దాంతో తొక్కిసలాట జరగడంతో 45 మంది చనిపోయారు. అప్పట ఇనుంచి దీని మీదకి ఎక్కనివ్వడం లేదు. దీని ప్రాంగణంలో ఉన్న ఇనుప స్తంభం ఇప్పటికీ తుప్పు పట్టకుండా అలాగే ఉండడం మరో విశేషం.
Authorization